01-08-2025 08:05:08 PM
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు నాటి భూస్వాములను నిజాం రజాకారులను తరిమిన మహావీరుడు కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ అన్నారు. శుక్రవారం పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్లో కాచం కృష్ణమూర్తి 19వ వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల కోసం అనేక ఆటుపోట్లు నిర్బంధాలను అధిగమించి పీడిత ప్రజల పక్షాన నిలిచి మహోత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో సముచిత పాత్రను పోషించారన్నారు. విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు మెలకువగా చాకచక్యంగా వ్యవహరించడంలో బహు నేర్పరి, ఐలమ్మ భూ పోరాటం, దొడ్డి కొమురయ్య నేలకొరిగిన ఉదాంతం నుంచి కృష్ణమూర్తి కార్యాచరణ ముమ్మురమైందని వారన్నారు.
నేడు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం పనిచేస్తుందని దేశాన్ని కార్పోరేట్ శక్తులకు దారదత్వం చేస్తుందన్నారు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం చేస్తూ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్నినీరుగారుస్తుందన్నారు. ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని కల్పించి 600 రూపాయలు కూలివ్వాలన్నారు. నేటితరనికి కృష్ణమూర్తి జీవితం ఆదర్శమని. వారు నడిచిన పోరుబాటలో ప్రజలను చైతన్యం చేస్తూ కష్టజీవుల రాజ్య స్థాపన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మన్నెం భిక్షం, మండల అధ్యక్షుడు కట్ట అంజయ్య ,పట్టణ ఉపాధ్యక్షులు తెలకపల్లి శ్రీను, విజయ్ మధు శంకర్ రాములు తదితరులు పాల్గొన్నారు.