08-06-2025 12:20:35 AM
అవగాహన పెరిగినా ఇంకా బాల్యవివాహాలు
చదువుకోవాల్సిన వయస్సులో పెళ్లిపీటలు
అదిలాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో బాల్యవివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. బాల్యవివాహాలు చేయవ ద్దంటూ అధికార యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, సామాజికవేత్తలు అవగాహన కల్పిస్తున్నా నిత్యం ఎక్కడోచోట చిన్నారి పెళ్లికూ తుళ్లు పెళ్లిపీటలు ఎక్కుతూనే ఉన్నారు. చిన్నవయస్సులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల బాల బాలికలు ఆనారోగ్యానికి గురి కావడమే కాదు వారి చదువు, భవిష్యత్ పట్ల ఆశలు, ఆకాంక్షలు అటకెక్కుతున్నాయి.
పేదరికంతో తల్లిదండ్రులే ఆడపిల్లలను భారంగా భావి స్తూ బాల్యవివాహాలకు పూనుకుంటుండం బాధాకరం. బాల్యవివాహాలను అరికట్టడానికి అధికార యంత్రాంగం, స్వచ్ఛంద సం స్థలు విశేష కృషి చేస్తున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని ఓ గ్రామంలో బాల్య వివాహానికి ఇరు కుటుంబాలు అంతా సిద్ధం అయ్యారు.
ఈనెల 8వ తేదీన మహారాష్ట్రల్లో పెళ్లి జరుగనుందన్న సమాచారాన్ని షీటీమ్ ద్వారా అందుకున్న అధికారులు, ష్యూర్ ఎన్జీవో సభ్యులు పెళ్లి నిర్వహించే ఇరుకుటుంబ సభ్యులను కలిసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లి ప్రయత్నం మాన్పించివేశారు.
5 నెలల్లో 13 బాల్య వివాహాలకు యత్నం..
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 13 బాల్య వివాహాలు చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ వివాహ ప్రయత్నా ల గురించి తెలుసుకున్న అధికారులు చాకచక్యంగా వ్యవహరించి అడ్డుకున్నారు. 11 బా ల్య వివాహాల సంఘటనలో బాలబాలికల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇప్పించి అడ్డుకోగా, ఈ ఏడాదిలో రెండు కేసులు సైతం నమోదు అయ్యాయి.
కౌన్సిలింగ్ చేసిన అధికారులు..
నేరడిగొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఎనిమిదో తరగతి చదువుతూ బడిమానేసిన బాలికను మహారాష్ట్రకు చెంది న యువకుడితో పెళ్లికి రంగం సిద్ధం చేశారు. ఈ వివాహం గురించి చైల్డ్లైన్ 1098కి సమాచారం అందింది. దీంతో జిల్లా సమన్వయకర్త సతీశ్, పోలీసు అధికారులు అక్కడకు వెళ్లి పెళ్లిని అడ్డుకోవటంతో పాటుబాలిక కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఆధార్కార్డులో పుట్టినతేదీ మార్చి..
ఇటీవల బేల మండలకేంద్రంలో మైనర్లకు పెళ్లి చేస్తున్నట్లు అధికారులకు సమా చారం అందింది. వెంటనే చైల్డ్లైన్ అధికారులు, డీసీసీవో సిబ్బంది, ష్యూర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అక్కడకు వెళ్లి పరిశీలించారు. వివాహం చేయటానికి ఏకంగా ఆధార్ కార్డులోనే పుట్టిన తేదీ మార్చివేశారు. అమ్మాయి పదో తరగతి మెమోను పరిశీలించగా ఈ విషయం తెలిసింది. వెంటనే వివా హాన్ని అడ్డుకుని కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు.
1098కి వచ్చిన సమాచారంతో..
మంచిర్యాల జిల్లా భీమారంలో 17 ఏళ్ల బాలికకు వివాహం చేస్తున్నట్లు 1098కి 15 రోజుల క్రితం సమాచారం అందింది. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచా రణ చేపట్టగా వధూవరులిద్దరూ మైనర్లేనని నిర్ధారణ అయింది. గ్రామపెద్దల సమక్షంలో కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించి, 18 ఏళ్లు పూర్తయ్యే వరకు వివాహం చేయ కూడదనే అంగీకార పత్రాన్ని కుటుంబ స భ్యుల నుంచి తీసుకున్నారు.
బాల్య వివాహాలతో అనర్థాలు..
* వివాహ వయస్సు రాకముందు బాలికలకు వివాహం చేస్తే రక్తహీనత సమస్య ఏర్పడుతుంది.
* ప్రసవ సమయంలో ఇబ్బందులు.. శిశువు ఆరోగ్యంగా జన్మించే అవకాశం ఉండదు.
* ప్రసవ సమయంలో రక్తస్రావం జరిగి బాలిక ప్రాణాలకే ముప్పువాటిల్లే అవకాశం.
* 14- ఏళ్లు ఉన్న బాలికను 25 ఏళ్లు వయసున్న పురుషుడికి ఇచ్చి పెళ్లి చేయడంతో వయస్సులో తేడాతో అవగాహన లేమి
* అంతేకాకుండా బాలిక యుక్తవయస్సులోకి వచ్చేసరికి భర్త వృద్ధుడు కావడమో, చనిపోవడమో జరుగుతుంది
* గృహహింసకు అవకాశం..
ఎవరికి ఫిర్యాదు చేయాలి... ?
బాల్యవివాహం జరుగబోతుందని, జరుగుతుందని కచ్చితమైన సమాచారం ఉంటే ఎవరైనా చైల్డ్లైన్ నంబర్ 1098కు, డయల్ 100కు సమాచారం ఇవ్వవచ్చు. వీటి ఆధారంగా కౌన్సిలింగ్ లేదా సుమోటోగా కేసు నమోదు సైతం చేయవచ్చు. ఐసీడీఎస్ అధికారులకు బాల్యవివాహాలను అడ్డుకునే హక్కులున్నాయి. వధువు, వరుడు తమకు పెళ్లి ఇష్టం లేదని అధికారులకు ఫిర్యాదు చేస్తే వెంటనే పెళ్లి నిలిపివేస్తారు. ఒకవేళ పెళ్లి జరిగినా చట్ట ప్రకారం చెల్లుబాటు కాదు.
అడ్డుకునే అధికారులు వీరే..
జిల్లా స్థాయిలో : కలెక్టర్
డివిజన్ స్థాయిలో : సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు
మండల స్థాయిలో : తహసీల్దార్
ప్రాజెక్టు స్థాయిలో : సీడీపీవోలు, ఏసీడీపీవోలు
గ్రామ స్థాయిలో : ఐసీడీఎస్ సూపర్వైజర్
బాల్యవివాహ రహిత సమాజం కావాలి..
బాల్యవివాహ రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరు బాధ్యత కృషి చేయాలి. ఎక్కడైనా బాల్యవివాహాలు జరిగిన, జరుగుతున్న, జరగబోయే సమాచారం ఉన్న 1098, 100కు సమాచారం ఇవ్వవచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. బాల్యావివాహాల నిర్మూలనకు అదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో ష్యూర్ స్వచ్ఛంద సంస్థ పని చేస్తోంది.
- రాజేంద్ర ప్రసాద్, జిల్లా బాలల సంరక్షణ అధికారి
అవగాహన కల్పిస్తున్నాం..
చదువుకునే వయస్సులో బాల్య వివాహలు చేయడం చట్టరీత్యానేరం. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పాఠశాలలు, కళాశాలలు, గురుకులల్లో అవగాహన కల్పిడంతో పాటు వాటితో జరిగే అనర్థాలు వివరిస్తున్నాం. 18సంవత్సరాల లోపు అమ్మాయి, 21 సంవత్సరాల లోపు అబ్బాయికి వివాహం చేస్తే 2 సంవత్సరాల జైలు, రూ. లక్ష జరిమానాను కోర్టు విధిచే అవకాశం ఉంది.
- గోపాల్ రెడ్డి, ష్యూర్ ఎన్జీవో అధ్యక్షుడు