03-05-2025 09:41:50 PM
రైతులకు వడ్ల పేమెంట్ ఆపొద్దు
కొనుగోళ్లలో ఇబ్బందులు పెట్టొద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్,(విజయక్రాంతి): మహిళా సంఘాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు ఏర్పాటు చేసే ఆలోచన ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరంలో అత్యాధునిక పాడీ క్లీనర్, డ్రయ్యర్ యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం, ఐకేపీ కేంద్రంలో వడ్ల కొనుగోళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా సంఘాలకు ఆర్టీసీలో 600 బస్సులు కొనాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని, ఇప్పుడు రైస్ మిల్లులు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ పథకం అమలైతే మొదట శనిగరం గ్రామంలోనే రైస్ మిల్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ధాన్యం తరలింపు వాహనాలకు సమస్యలు లేకుండా చూడాలన్నారు. రైతుల వడ్లకు చెల్లింపులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శనిగరంలో ఆటోమేటిక్ పాడి డ్రయ్యర్ క్లీనర్ యంత్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని, ధాన్యం కొనుగోలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఇటువంటి యంత్రాలను అందిస్తున్నామని తెలిపారు. కొత్త యంత్రాలను కాపాడుకోవడానికి రూ.5 లక్షలతో షెడ్డు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అకాల వర్షాల వల్ల రైతులకు ఇబ్బంది కలగకుండా తాటిపత్రులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
శనిగరం ప్రాజెక్టు దగ్గర ఉండడంతో ఇక్కడ వడ్ల ఉత్పత్తి అధికంగా ఉంటుందని, శనిగరం ప్రాజెక్టు కాల్వలను పూడిక తీస్తే వరి ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఇరిగేషన్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కోహెడ మండలంలో రూ.180 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు ప్రారంభం కానున్నాయని, శనిగరం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరారని, త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామంలో మంచినీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. వంటిమామిడి దగ్గర వెజిటబుల్ మార్కెట్ మాదిరిగా శనిగరంలో చేపల మార్కెట్ ఏర్పాటు చేస్తామని, ఫిషరీస్ సంఘాలు అక్కడే చేపలు అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌదరి తదితరులు పాల్గొన్నారు.