calender_icon.png 13 June, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విమాన ప్రమాద స్థలానికి చేరుకున్న మంత్రి రామ్మోహన్

12-06-2025 07:56:27 PM

అహ్మదాబాద్: అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియా విమానం(Air India Flight) గురువారం కుప్పకూలిపోయింది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI171 టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం మేఘనినగర్ ప్రాంతం సమీపంలో కూలిపోయిన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు ఎయిర్ ఇండియా విమాన ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... ప్రమాద ఘటన నన్ను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ప్రమాదం విషయం తెలియగానే విజయవాడ నుంచి బయలుదేరినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఫోన్ చేసి ప్రమాదం గురించి ఆరా తీశారని, విమాణ ప్రయాణికుల్లో చిన్నారులు కూడా ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరుగుతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ వివరించారు. అదే విమానంలో బీజేపీ నేత, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారని తెలిసి చాలా బాధగా ఉందన్నారు. అలాగే ఇతర జాతీయులు కూడా ఉన్నారు.  DGCA, AAI, ఎయిర్ ఇండియా, NDRF, స్థానిక పరిపాలన బృందాలు 24 గంటలు పనిచేస్తున్నాయి. ఈ విషాద సమయంలో బాధితులు, వారి కుటుంబాలను ఆదుకోవడానికి తాము చేయగలిగినదంతా చేస్తున్నామని తెలిపారు.