బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణీయులకు చేసిన మేలు శూన్యం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సొంతింటి కల నెరవేరుస్తాం..
ఇన్కం ట్యాక్స్ స్లాబ్ సిస్టమ్ను సవరిస్తాం..
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
మంథని, మే 2 (విజయక్రాంతి): పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణీయులకు జరిగిన మేలు శూన్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ లశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీతో కలిసి సింగరేణి ఆర్టీ ఆర్టీ ఓసీల పరిధిలో నిర్వహించిన గేట్ మీటింగ్లో మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తామని, ఇన్కం ట్యాక్స్ స్లాబ్ సిస్టమ్ను సవరిస్తామని హామీ ఇచ్చారు.
ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ విజన్ ఉన్న యువకుడని, ఆయన గెలుపుతో కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. గడ్డం వంశీ మాట్లాడుతూ. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పంటలకు మద్దతు ధర అమలు, ఉపాధి కూలీల వేతనం పెంపె, ప్రతి పేద కుటుంబానికి ఏటా రూ.లక్ష సాయం, రూ.25 లక్షల వరకు క్యాష్ లెస్ వైద్య సాయం అందిస్తామన్నారు. మంత్రి వెంట ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్, మినిమం వేజ్ బోర్డు కమిటీ చైర్మన్ జనక్ప్రసాద్, పార్టీ నేత తొట్ల తిరుపతి యాదవ్ ఉన్నారు.




