30-04-2025 11:14:36 PM
మహదేవపూర్ (విజయక్రాంతి): ఇండ్లులేని నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం ఎల్కేశ్వరం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు ఇండ్లు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... సమాజంలోని పేదవర్గాలకు గౌరవప్రదమైన జీవన వాతావరణాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం ద్వారా నివాస అవసరాలను తీర్చడమే కాదు, మెరుగైన మౌలిక వసతులు కూడా కల్పించనున్నామని తెలిపారు. ప్రభుత్వ సంకల్పం మేరకు ప్రతి కుటుంబానికి ఇల్లు మౌలిక వసతులను అందించడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో నాణ్యత, సమయ పాలన పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ, ఎంపిడిఓ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ ప్రహ్లాద్ రాథోడ్, మహాదేవ పూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్బర్ ఖాన్, మాజీ ఎంపీపీ రాణి బాయి,మాజీ జెడ్పిటిసి అరుణ, ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్, కాంగ్రెస్ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.