వీడిన మిర్యాలగూడ ట్రిపుల్ మర్డర్ కేసు
అగ్ని ప్రమాదం కాదు పక్కా హత్య
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్గొండ క్రైం, జూన్ 21: జిల్లాలోనిమిర్యాలగూడ పట్టణంలో గల కలాల్వాడలో ఈ నెల 4వ తేదీన జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు సజీవదహనమై మృతి చెందిన సంఘటనలో హత్య కోణాన్ని పోలీసులు చేదించారు. సంఘటన వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్లు సమావేశంలో వెల్లడించారు.
ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంగా భావించిన ఈ ఘటన వెనుక పథకం ప్రకారం జరిగిన హత్య ఆని దర్యాప్తులో వెలుగులోకి వచ్చిందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం, ఊళ్ళ పాలెం గ్రామానికి చెందిన కాళహస్తి శిరీష్ కుమార్ (38) ఆన్లైన్ వివాహ వేదికల ద్వారా భర్త చనిపోయి ఇద్దరు పిల్లలు ఉన్న ధనలక్ష్మిని రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడన్నారు. ఓ కేసులో జైలుకెళ్లిన సమయంలో ధనలక్ష్మి బెయిల్ కోసం ప్రయత్నం చేయలేదని ఆమెపై కక్ష పెంచుకున్నాడన్నారు.
ధనలక్ష్మ ఆమె పిల్లలను హత్య చేయాలని ముందుగానే నిర్ణయించుకునీ రాత్రి సమయంలో అందరూ నిద్రలో జారుకున్నారని నిర్ధారించుకున్న తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడన్నారు. ఆ మంటలు ఇల్లంతా వ్యాపించి సిలిండర్ పేలడంతో ఇంట్లో నిద్రిస్తున్న ధనలక్ష్మి తల్లి వనం చంద్రమ్మ (48), కుమారుడు లక్ష్మణ్ (17), కుమార్తె ప్రణతి (15) మంటల్లో సజీవదహనమై మృతి చెందారన్నారు. ఆ సమయంలో ధనలక్ష్మి లేకపోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. తొలుత ప్రమాదంగా భావించగా తదుపరి అసలు విషయాలు బయటకు వచ్చాయన్నారు.
ఈ హత్యకు సంబంధించిన పలు కీలక ఆధారాలు స్వీకరించిన పోలీసులు నిందితుని అరెస్ట్ చేశారు. కేసును ఛేదించిన డీసీఆర్బీ డీఎస్పీ జి. రవి, మిర్యాలగూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎం. నాగభూషణరావు, ప్రొబేషనరీ ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్లు జి. రాజారాం, నల్లగంతుల శ్రీను, ఎస్. వెంకటేశ్వర్లు, హుస్సేన్, బి. వీరబాబు, జి. నర్సింహా, బి. ప్రసాద్లను జిల్లా ఎస్పీ అభినందిస్తూ ప్రశంసాపత్రాలు నగదు రివార్డులను ప్రకటించారు.






