హనుమకొండకు చెందిన రూపేశ్ చంద్ర
మాస్టర్స్ చేసేందుకు యూఎస్ వెళ్లిన యువకుడు
హనుమకొండ, మే 9 (విజయక్రాంతి): అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన తెలంగాణ యువకుడు అదృశ్యమయ్యాడు. హనుమకొండకు చెందిన చింతకింది రూపేశ్చంద్ర ప్రస్తుతం విస్కాన్సిన్ కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నాడు. ఈనెల 2న చికాగోకు వెళ్లాడు. అప్పటి నుంచి యువకుడు కనిపించట్లేదు. అదేరోజు మధ్యాహ్నం రూపేశ్తో వాట్సాప్ కాల్ మాట్లాడామని ఆ తర్వాతి నుంచి అతడి ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఆ తర్వాత రూపేశ్ స్నేహితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఎవరినో కలిసేందుకు రూపేశ్ బయటకు వెళ్లాడని, వారెవరో తమకు తెలియదని అతడి స్నేహితులు చెబుతున్నారు. విద్యార్థి అదృశ్యంపై చికాగోలోని భారత రాయబార కార్యాలయం స్థానిక పోలీసులతో సంప్రదింపులు జరుపుతోంది. భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రత్యేక చొరవ తీసుకుని యువకుడిని గుర్తించేందుకు చర్యలు చేపట్టింది.
కుమారుడి అదృశ్యంతో తల్లిదం డ్రులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్అర్ఫత్ అనే యువ కుడు కూడా అమెరికాలో మాస్టర్స్ చేసేందుకు వెళ్లి ఏప్రిల్లో అదృశ్యమయ్యాడు. తర్వాత కొన్నిరోజులకు కీవ్ల్యాండ్లో శవమై కనిపించాడు. ఫిబ్రవరి, జనవరిలోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. వాటిని మరువకముందే మరో యువకుడు అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో కొద్దిరోజులుగా దాడులు, కిడ్నాప్ల ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి.