12-06-2025 01:54:37 AM
ములుగు, జూన్ 11 (విజయక్రాంతి): కాలేశ్వరం, ధరణి, మిషన్ భగీరథ కార్యక్రమాలు గత బీఆర్ఎస్ పెద్ద స్కాములని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. బుధవారం ములుగు జిల్లాలో పర్యటించిన ఆయన ఇంచెర్లలో మంత్రి సీతక్కతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నాయకులు పింక్ వ్యవస్థను బలోపేతం చేసుకున్నారని, ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. అలాగే భూభారతి చట్టం ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తున్నామని, ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో భూ సమస్యలను పూర్తిగా తొలగించే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు నేరుగా అప్లికేషన్లు స్వీకరించి, సమస్యలను స్థానికంగానే పరిష్కరిస్తారని తెలిపారు.
ఈ పర్యటనలో మంత్రి పొంగులేటి రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కట్టుబడి ఉందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లక్షలాది మందికి గృహ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం గత ప్రభుత్వం వదిలివెళ్లిన రూ.7 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నప్పటికీ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.