03-10-2025 07:13:54 PM
ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
వలిగొండ,(విజయక్రాంతి): భువనగిరి నియోజకవర్గం పరిధిలోని సాగునీటి కాలువలు అన్నిటిని పూర్తిచేసి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం వలిగొండ మండలంలోని పహిల్వాన్ పురం గ్రామం పరిధిలో గల బునాదిగాని చెరువును, కాలువలను ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించి అలుగు పోస్తున్న చెరువులకు పూలు చల్లి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దా కాలంగా గత ప్రభుత్వం బునాదిగాని కాలువను పూర్తి చేయలేకపోయారని అన్నారు.
కాంగ్రెస్ ప్రజా పాలన వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని కాలువలు అన్నిటిని పూర్తి చేసేందుకు నిధులను మంజూరు చేయించడం జరిగిందని పనులు త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. బునాదిగాని చెరువు ద్వారా టేకులసోమవారం, పహిల్వాన్పురం, రెడ్లరేపాక, కంచనపల్లి, పులిగిల్ల తదితర గ్రామాలకు సాగునీరు అందుతుందని దీంతో భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరుగుతాయని అన్నారు. రైతుల కండ్లల్లో ఆనందం చూసేందుకు నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాల్వను పూర్తి చేస్తానని అన్నారు.