24-12-2025 12:32:26 AM
జలమండలికి రూ.3 కోట్ల చెక్కును అందించిన సొసైటీ ప్రతినిధులు
పటాన్ చెరు, డిసెంబర్ 23 :బీఈమెక్ సొసైటీ కాలనీ వాసుల కోసం స్వచ్ఛమైన తాగునీటి జలాలు అందించాలని కోరుతూ పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన కృషి ఫలించింది. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్ నగర్ లో బిహెచ్ఎల్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు బిఈమెక్ సొసైటీ పేరుతో గృహాలను నిర్మించుకొని జీవనం కొనసాగిస్తు న్నారు. ఇటీవల మంచినీటి కనెక్షన్ల కోసం జలమండలికి దరఖాస్తు చేసుకోగా..
మూడు కోట్ల 80 లక్షల రూపాయలు చెల్లించాలని ఇందులో 86 లక్షల రూపాయలు ఇంప్రూవ్మెంట్ చార్జీలు కట్టాలని నోటీసులు అందజేశారు. ఈ నేపథ్యంలో గత మూడు నెలల క్రితం ఇంప్రూవ్మెంట్ చార్జీలు తగ్గించాలని కోరుతూ పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించగా.. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ జలమండలి ఎండి అశోక్ రెడ్డిని కలిసి చార్జీలు తగ్గించాలని వినతి పత్రం అందించారు.
ప్రస్తుతం కాలనీలో అత్యధిక శాతం ఉద్యోగ విరమణ పొందిన కార్మికులు నివసిస్తున్నారని.. మూడు కోట్ల రూపాయలు చెల్లించే ఆర్థిక పరిస్థితులు వారికి లేవని ఆయన తెలిపారు. 86 లక్షల రూపాయల ఇంప్రూవ్మెంట్ చార్జీలను రద్దు చేస్తే మిగతా డబ్బులు కట్టేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారని జలమండలి ఎండి అశోక్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే జిఎంఆర్ వినతికి స్పందించిన జలమండలి అధికారులు ఇంప్రూవ్మెంట్ చార్జీలు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు మంగళవారం జలమండలి కార్యాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ సమక్షంలో.. మంచినీటి కనెక్షన్ల కోసం మూడు కోట్ల రూపాయల డిడిని జలమండలి ఎండి అశోక్ రెడ్డికి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు చిట్టి ఉమేష్, అసోసియేషన్ అధ్యక్షులు శివ నారాయణ, ప్రధాన కార్యదర్శి సంజీవ్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.