25-04-2025 01:44:43 AM
రిమాండ్కు తరలించిన రాజేంద్రనగర్ పోలీసులు
జర్నలిస్టుపై ఫిర్యాదు చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు
ఉద్దేశపూర్వకంగానే నాపై కేసు: రిపోర్టర్ శ్యామ్
న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశానని వెల్లడి
రాజేంద్రనగర్, ఏప్రిల్ 24: రూ. 5 కోట్లు ఇవ్వాలని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావును బ్లాక్మెయిల్ చేశాడనే ఆరోపణలతో ఓ న్యూస్ ఛానల్ జర్నలిస్టు శ్యామ్ సుందర్ ను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఏప్రిల్ 22న జుక్కల్ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్యామ్ 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, లేకపోతే సోషల్ మీడియాలో ఎమ్మెల్యే గురించి అసత్య ప్రచారం చేస్తామని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
శ్యామ్, నీరుపా అనిల్ కుమార్ దాదానియా తో కలిసి ఎమ్మెల్యే పై అబద్ధపు ఆరోపణలతో డబ్బులు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఓ మహిళతో ఇంటర్వ్యూ చేసి దానిని విడుదల చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఏప్రిల్ 23న శ్యామ్ నేరం అంగీకరించాడు. ఈ సంఘటనలో నిందితులు ఉపయోగించిన లాప్టాప్ లు, కంప్యూటర్ ల తోపాటు మొబైల్ ఫోన్, వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మహిళకు న్యాయం చేయాలన్నాను
ఎమ్మెల్యే తనను మోసం చేశారని ఓ మహిళ తన వద్దకు వచ్చిందని ప్రజా వాయిస్ రిపోర్టర్ శ్యామ్ గురువారం ఉపర్పల్లి కోర్టు వద్ద మీడియాకు తెలిపారు. న్యాయం చేయాలని కోరడంతోనే తాను డబ్బులు డిమాండ్ చేసినట్లు ఎమ్మెల్యే అక్రమంగా కేసు బనాయించాలని ఆయన ఆరోపించారు.
తాను బీసీని అయినందుకు తనపై అక్రమంగా కేసు పెట్టారని మండిపడ్డారు. తాను ఏ తప్పు చేయలేదని శ్యామ్ పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, తాను న్యాయపరంగా ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు.