06-02-2026 01:37:43 AM
భారీ మెజార్టీతో గెలిపించాలి
వనపర్తి, కొత్తకోటలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రచారం
వనపర్తి, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురువారం పాల్గొన్నారు. 13వ వార్డు టీఆర్పీ అభ్యర్థి బాల రాజు సాగర్ తరఫున ఇంటింటి ప్రచారం చేశారు. ఇప్పటివరకు అధికార పార్టీల పాలనలో వనపర్తి పట్టణం అభివృద్ధికి నోచు కోలేదని, ప్రజల ప్రాథమిక సమస్యలు పట్టించుకోని పాలకులకు ఈ ఎన్నికల్లో గట్టి గుణ పాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. టీఆర్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపాలిటీల్లో పారదర్శక పాలన తీసుకొస్తామని ప్ర జల కట్టే పన్ను ప్రజల అభివృద్ధికే ఖర్చు చేస్తామని తెలిపారు.
వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు పాల్గొన్నారు. అలాగే కొత్తకోట మున్సిపాలిటీలోని 3వ వార్డు టీఆర్పీ అభ్యర్థి రఫీక్కు మద్దతుగా మల్లన్న ప్రచారం నిర్వహించి ప్రజలను ఓట్లను అభ్యర్థించారు. ‘ఏళ్ల తరబడి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మున్సిపాలిటీలను దోచుకున్నాయి తప్ప ప్రజలకు చేసిందేమీ లేదునీ, పేదల సమస్యలు, మౌలిక వసతులు పట్టించుకోని ఈ పార్టీలకు ఈ ఎన్నికల్లో ప్రజలే సరైన బుద్ధి చెప్పాలి’ అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కెత్తర గుర్తుకు ఓటు వేసి రఫీక్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.