10-06-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, జూన్ 9: మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తున సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా స్పందించారు. మోదీ పాలన స్వర్ణయుగం అని షా అభిప్రాయపడగా.. మోదీ రాజకీయ సంస్కృతిని మార్చారని నడ్డా పేర్కొన్నారు. మోదీ 11 ఏండ్ల పాలనా విజయాలను కేంద్ర హోం మంత్రి అమిత్షా ఎక్స్లో పోస్ట్ చేశారు.
‘దేశ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి.. భారత్ను ప్రతి రంగంలో నంబర్ వన్గా నిలిపేందుకు ఈ ప్రయాణం కొనసాగుతోంది. మోదీ పాలనలో దేశం కొత్త శకాన్ని చూస్తోంది. గత ప్రభుత్వం అనేక కుంభకోణాలు చేయగా.. మోదీ ప్రభుత్వంలో పారదర్శకతకు పెద్ద పీట వేశారు. దృఢమైన సంకల్పం, ప్రజాసేవ పట్ల తపన ఉంటే.. సుస్థిర పాలన సాధ్యం అని మోదీ ప్రభుత్వం నిరూపించింది.’ అని పేర్కొన్నారు.
దేశ ముఖచిత్రమే మార్చేశారు: నడ్డా
ఈ 11 ఏండ్లలో ప్రధానిగా మోదీ దేశ ముఖ చిత్రాన్నే మార్చేశారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ ప్రధానిగా మోదీ ప్రభుత్వాన్ని జవాబుదారీగా మార్చారు. రాజకీయ సంస్కృతిలో కొత్త శకానికి నాంది పలికారు. ఈ 11 ఏండ్ల పాలనను సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. మోదీ హయాంలో సాటిలేని అభివృద్ధి సాధ్యమైంది.
దేశ భవిష్యత్ కూడా మంచి ప్రణాళికలు రచించాం. జమ్మూకశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగింపు సాధ్యం కాదని అంతా అన్నారు. కానీ మోదీ ప్రభుత్వం దాన్ని చేసి చూపెట్టింది. 11 ఏండ్ల నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను జాగ్రత్తగా చూసుకుంటోంది. ఈ 11 ఏండ్లలో 25 కోట్ల మంది దేశ ప్రజలు దారిద్య్రరేఖ నుంచి బయటపడ్డారు.’ అని తెలిపారు.