05-11-2025 01:40:47 PM
హైదరాబాద్: తెలంగాణలో రాబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి వద్దతుగా ఆయన యూసఫ్ గూడ డివిజన్ లోని వెంకటగిరిలో ఇంటింటి ప్రచారం పాదయాత్ర నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఈ ఉపఎన్నికల్లో గెలిస్తే జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా చేశారని, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోనూ, జూబ్లీహిల్స్ లోనూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.