7 May, 2026 | 1:29 AM

ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలి

10-12-2024 05:49 PM

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ముక్కోటి మహోత్సవాలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు అధికారులకు అప్పగించిన విధులను అంకితభావంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. మంగళవారం భద్రాచలం ఆర్డీవో కార్యాలయంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్దేశించిన పనులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. మహోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షణ భద్రాచలం ఆర్డీవో, బందోబస్తు ఏర్పాట్లు పోలీస్ శాఖ చేపట్టాలని చెప్పారు. లాడ్జి, హోటల్ యజమానులతో సమావేశం నిర్వహించి ధరల నిర్ణయించాలని సబ్ కలెక్టర్‌కు సూచించారు.

ఆలయ పరిసరాల్లో సీసీటీవీ లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. భద్రాచలం, దుమ్ముగూడెం లోని దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. భక్తులు మహోత్సవాలు వీక్షణకు ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని, హంస వాహనం తనిఖీ చేసి దృవీకరణ నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ ఈ ఈ ని ఆదేశించారు. హంస వాహనంలోకి పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించాలన్నారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా పటిష్ట బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆహార పదార్థాలు నాణ్యతను తనిఖీ చేసి నివేదిక అందజేయాలని ఆహార తనిఖీ, తూనికలు కొలత శాఖల అధికారులను ఆదేశించారు.

భద్రాచలం పట్టణంలో, పర్ణశాలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. దుమ్ముగూడెంలో ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతి సెక్టార్‌కు ఏర్పాట్లు పర్యవేక్షణకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించనున్నట్లు తెలిపారు. భక్తులకు సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని చెప్పారు. భక్తులకు బస్సులు, రైల్వే సమయాలను, అలాగే జిల్లాలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను తెలియజేయు చార్టులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులు వాహనాలను పార్కింగ్ చేయడానికి ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలకు సైనేజ్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. 

భద్రాచలం కరకట్ట వద్ద మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రణాళికలు సిద్ధం చేయడంలో అలసత్వం వహించిన అధికారుల పట్ల అసహనం వ్యక్తం చేశారు. తెప్పోత్సవం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలతో పాటు ఈసారి భద్రాచలం పర్యాటక కేంద్రం అభివృద్ధి పరచుటకు గాను రాష్ట్రస్థాయి కళాకారులచే భద్రాచలం ప్రాముఖ్యత తెలిపే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన సాంప్రదాయ వంటకాలు, వస్తువులు ప్రతిబింబించే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలో అన్ని విమానాశ్రయాల్లో భద్రాచలం యొక్క ప్రాముఖ్యత తెలిపే విధంగా గోడ పత్రికలు ఏర్పాటు అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

భద్రాచలంలో పర్యాటకరంగా అభివృద్ధి పరుచుటకు గాను గిరిజన మ్యూజియం, దుమ్ముగూడెంలో పర్యాటకులు గిరిజనుల యొక్క సాంప్రదాయం ఉట్టిపడేలా, పర్యాటకులు ఆహ్లాదకరంగా గడిపే విధంగా నిర్మించడం జరుగుతుందని అదేవిధంగా కిన్నెరసానిలో పుట్టి ప్రయాణం, కాటేజీల నిర్మాణం చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో గుంతలు పడిన రోడ్డును రెండు రోజుల్లో వెట్ మిక్సర్ తో పుడ్చాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలోజిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీవో రాహుల్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఈవో రమాదేవి, భద్రాచలం ఆర్డీవో దామోదరరావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.