10-07-2025 11:12:59 AM
మెడికల్ కళాశాల అధికారుల ఇష్టారాజ్యం.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) మెడికల్ కళాశాల నూతన భవనం ప్రారంభోత్సవానికి ఈనెల 11న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డిలు పర్యటించనున్నారు.
ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ గత మూడు రోజుల క్రితమే బదిలీ వేటుపడిన నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రఘు పేరును కూడా శిలాఫలకంపై చేర్చడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. అతనితోపాటు నూతన సూపరింటెండెంట్ ఉషారాణి పేరు కూడా చేర్చుతూ శిలాఫలకంపై తమ ఇష్టా రీతిగా పేర్లు నమోదు చేయడం ప్రోటోకాల్ పంచాయతీకి కారణం అవుతోంది. మాజీ అధికారుల పేర్లు కూడా నమోదు చేయడం పట్ల అధికారుల అలసత్వానికి నిదర్శనంగా కనిపిస్తోంది. మెడికల్ కళాశాల భవన నిర్మాణం పూర్తయిన సందర్భంగా ఆర్అండ్ బి అధికారులు శిలాఫలకాన్ని ముద్రిస్తున్నారు . ఈ విషయంపై ఆర్ అండ్ బి డిఈఈ విజయ్ కుమార్ ను వివరణ కోరగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి ఆదేశాల మేరకే ఏర్పాటు చేసినట్లు తెలిపారు.