13-12-2025 06:43:00 PM
గజ్వేల్: సిద్దిపేట జిల్లా వర్గల్ లోని జవహర్ నవోదయ విద్యాలయం ఆరవ తరగతిలో 80 సీట్ల కై 2026 - 27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికై నిర్వహింపబడిన జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ ఎంపిక పరీక్ష 2026 శనివారం నాడు ప్రశాంతంగా జరిగిందని విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీ దాసి రాజేందర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో మొత్తము 4,754 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా, అందులో 3,976 మంది హాజరయ్యారు. 778 మంది గైర్హాజరయ్యారు. మెదక్ జిల్లాలో ఆరు కేంద్రాల్లో 1,002 అభ్యర్థులు, సిద్దిపేట జిల్లాలో ఏడు కేంద్రాలలో 1,453 మంది, సంగారెడ్డి జిల్లాలో 1512 మంది అభ్యర్థులు పరీక్షలు రాసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో సుమారు 22 పరీక్ష కేంద్రాలలో నిర్వహింపబడిన ఈ ప్రవేశ ఎంపిక పరీక్ష నిర్వహణకు సహకరించిన మూడు జిల్లాల కలెక్టర్లకు, మూడు జిల్లాల పోలీసు, వైద్య, విద్యాశాఖ అధికారులకు, వారి సిబ్బందికి ప్రిన్సిపాల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సంబంధిత ఎంఈఓలు , రెవెన్యూ అధికారులు పర్యవేక్షించారు.