15-11-2025 01:55:36 AM
బీహార్లో మహిళలు, యువత, ఈబీసీలు (మై) మమ్మల్ని గెలిపించారు..
‘ముస్లిం లీగ్ మావోయిస్టు పార్టీ’గా కాంగ్రెస్ పార్టీ
విజయోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ
న్యూఢిల్లీ, నవంబర్ 14: బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ‘మై’ (మహిళలు, యువత, ఈబీసీలు) ఫార్మలా అమలు చేసి గెలిచిందని ప్రధాని మోదీ తెలిపారు. ఎన్నికల్లో విజ యం సందర్భంగా శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యాలయం లో ఆ పార్టీ శ్రేణులతో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు.
మహాఘట్బంధన్ ‘ముస్లిం, -యాదవ్-’ (మై) అనే బుజ్జగింపు సూత్రాన్ని రూపొందించినప్పటికీ, తమ ‘మై’ ఫార్మూలా ధాటికి మహా ఘఠ్బంధన్ ‘మై’ తాళలేకపోయిందని ఎద్దేవా చేశారు. బీహార్లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో తమ కూటమి 200కి పైగా సీట్లు గెలుచుకుని విజయ బావుటా ఎగురవేసిందని, మూడు వంతుల మెజార్టీ సాధించింద ని కొనియాడారు.
బీహార్లో ఆర్జేడీ ఆటవిక పాలన (జంగిల్రాజ్)ను కూకటివేళ్లతో పెకిలించామని, ఇక తమ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని స్పష్టం చేశారు. ఆ రాష్ట్ర ప్రజలకూ ఆటవిక పాలన నుంచి విముకి కల్పిస్తామని పేర్కొన్నారు. పవిత్ర గంగా నది బీహార్ గుండా పశ్చిమ బెంగాల్కు ప్రవహిస్తుందని, అలాగే ఎన్డీయే కూటమి విజయం కూడా బీహార్ నుంచి బెంగాల్కూ బదిలీ అవుతుందని చమత్కరించారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ‘ముస్లిం లీగ్ మావోయిస్టు పార్టీ’గా మారిందని, ఆ పార్టీ అజెండా ఇప్పుడు వాటి చుట్టూనే తిరుగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఒక ‘పరాన్నజీవి’లా మారిందని, తమ మిత్రపక్షాల ఓట్లను సైతం తన ఓట్లుగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ వల్ల మిత్రపక్ష పార్టీలన్నింటికి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. కాబట్టి కాంగ్రె స్తో జతకట్టే ప్రాంతీయ పార్టీలన్నీ ఇకపై ఆలోచించుకోవాలని హితవు పలికారు.
రీపోలింగ్ అన్న మాటే లేదు..
ఒకప్పుడు బీహార్లో ఎన్నికలంటే అనేక విడతల్లో జరిగేవని ఇప్పుడావసరం లేదని, రెండు విడతల్లో విజయవంతంగా ఎన్నికలు పూర్తిచేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రెండు విడతల్లో ఒక్క అవాంఛీనయ ఘటనైనా చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. నాడు మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 3గంటల వరకే పోలింగ్ జరిగేదని, కొన్నిచోట్ల అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునేవని గుర్తుచేశారు.
కొన్నిచోట్ల రీపోలింగ్ అవసరమయ్యే దని పేర్కొన్నారు. ఇకపై బీహార్కు అలాంటి చీకటి రోజులు ఉండవని, రాష్ట్రానికి ఇక కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాల వస్తాయాని ప్రధా ని మోదీ ఆకాంక్షించారు.
ఎన్నికల ముం దు తాను ఛఠ్ పూజలో పాల్గొంటే ఏఐసీసీ అగ్రనేత ఎద్దేవా చేశారని, ఆయనకిప్పుడు ఓటర్లే బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ఛాఠ్పూజకు యూనెస్కో గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషిచేస్తానని ప్రధాని ప్రకటించారు. వేడుకల్లో కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్ సింగ్ సహా పలువురు నేతలు తదితరులు పాల్గొన్నారు.