calender_icon.png 30 June, 2025 | 10:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు నేడు నామినేషన్ల స్వీకరణ

30-06-2025 02:45:16 AM

  1. అధిష్ఠానం సూచించిన ఒక నేత దాఖలు?
  2. బీసీ సామాజికవర్గానికే పదవి దక్కే అవకాశం?

హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకానికి ఆదివారం అధిష్ఠానం నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పార్టీ నేతల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని స్పష్టం చేసింది. నేతలు ఇదే రోజు సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్ ఉప సంహరించుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నది. పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఎండల లక్ష్మీనారాయణ, పరిశీల కురాలిగా కర్ణాటకకు చెందిన శోభ కరంద్లాజే వ్యవహరించనున్నారు. 

నామినేషన్ వేసే నేతనే.. దళపతి?

ఒకటి కంటే ఎక్కువ నామిషన్లు దాఖలైతే.. ఎన్నిక జరిగే అవకాశం ఉందని, ఒక్కరే దాఖలు చేస్తే, ఆ వ్యక్తే పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపడతారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు పదవి ఎవరికి కట్టబెట్టాలనే అంశంపై అధిష్ఠానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు, అధిష్ఠానం సూచించిన ఆ నేత మాత్రమే నామినేషన్ దాఖలు చేస్తారమనే ప్రచారం కూడా జరుగుతున్నది. దీంతో సోమవారం పార్టీ కార్యాలయానికి వచ్చి నామినేషన్ వేసే నేతనే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అని కొందరు భావిస్తున్నారు.

బీసీ సామాజికవర్గానికే పదవి?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే. ప్రస్తుతం కిషన్‌రెడ్డి పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్న నేపథ్యంలో అధిష్ఠానం బీసీ నేతకే పార్టీ రాష్ట పగ్గాలు అప్పగిస్తుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పదవిపై ఇప్పటికే అధిష్ఠానం రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్‌ను సంప్రదించ గా, అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది.

దీంతో ఆ ఛాన్స్ బీసీ సామాజికవర్గానికి చెందిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంక ర్‌లో ఒకరికి వచ్చే అవకాశ ఉందని కొందరు నాయకులు అంచనా వేస్తున్నారు. లేదంటే.. అనూహ్యంగా గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను సైతం రంగంలోకి దింపే అవకాశం ఉందని భావిస్తున్నాయి.

తాను అధ్యక్ష రేసులో లేనని ఇప్పటికే బండి సంజయ్ మీడియా ముఖంగా ప్రకటించినప్పటికీ, పార్టీ ఆదేశిస్తే ఆయనకు ఆ పదవి నిర్వహించక తప్పదనే అభిప్రాయమూ పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. ఒకవేళ బీసీ నేతలను దాటి అధిష్ఠానం పదవి కట్టబెట్టాలనుకుంటే.. ఎంపీ డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావుకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తున్నది.