30-06-2025 02:08:38 AM
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): ‘మేకిన్ ఇండియా’ కాదు.. ‘ఇన్వెంట్ ఇన్ తెలంగాణ’ అన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వ నినాదం, లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. ఆదివారం హైటెక్స్లో ‘ది ఫెడరేషన్ ఆప్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్టీసీసీఐ)’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్పో(ఐఐటీఈఎక్స్) 2025’ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తెలంగాణ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) కంపౌండ్ మం
త్లీ గ్రోత్ రేటు (సీఎంజీఆర్) 2.9 శాతం నమోదు కాగా జాతీయ సగటు 0.52 శాతం మాత్రమేనని అన్నారు. ఆరు రేట్లు తెలంగాణలో అధికంగా నమోదయ్యిందని తెలిపారు. 2024 ఇండస్ట్రియల్ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ రూ.2.77 లక్షలకు చేరిందని, ఇంధన వినియోగంలో 15.6 శాతం, జీఎస్టీ వసూళ్లలో 9.8 శాతం, పే రోల్ ఎన్రోల్మెంట్స్ లో 13.9 శాతం వృద్ధి రేటు నమోదైందన్నారు.
ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ కేంద్రంగా జోన్లు
ఏడాదిన్నర కాలంలోనే రూ.3లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఒక్క లైఫ్ సెన్సైస్ రంగంలోనే రూ.40వేల కోట్ల పెట్టుబడులొచ్చాయని, కొత్తగా 150 కొత్త ప్రాజె క్టులు మొదలయ్యాయని వెల్లడించారు. 51వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 1.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించినట్టు చెప్పారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, లైఫ్ సెన్సైస్ సిటీ, గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. అవుటర్ రింగ్ రోడ్డు లోపల టెక్నాలజీ, సర్వీసెస్ జోన్, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య మ్యానుఫాక్చరింగ్ జోన్, ఆర్ఆర్ఆర్ బయట వ్యవసాయ, గ్రామీణ ఇన్నోవేషన్ జోన్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు.
భవిష్యత్తు తరాల కోసం ప్రణాళికలు..
తాము అయిదేళ్ల కోసం ప్రణాళికలు రూ పొందించడం లేదని, రాబోయే తరాల కో సం ఆలోచిస్తున్నామని శ్రీధర్బాబు తెలిపారు. రాష్ర్ట ఆర్థిక వ్యవస్థను 2035 నాటికి ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకు న్నామని, ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్య సాధనలో భాగస్వామ్యమయ్యేందుకు ముందుకొచ్చిన టోనీబ్లెయిర్ ఇన్స్టిట్యూట్కు ధన్యవాదాలు తెలిపారు.
ఎంఎస్ఎంఈల వాటా 10 శాతానికి పెరిగేలా
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)ల బలోపేతంపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. గత 18 నెలల్లో కొత్తగా 15 వేల ఎంఎస్ఎంఈలు ప్రారంభమయ్యాయని, మన జీఎస్డీపీలో ఎంఎస్ఎంఈల వాటాను 10 శాతానికి పెంచాలనే సంకల్పం తో గతేడాది ప్రత్యేక పాలసీకి రూపకల్పన చేశామన్నారు.
ప్రతీ జిల్లా కేంద్రంలోనూ ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని, వీటిల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు డా.సురేశ్కుమార్ సింఘాల్, సీనియర్ ఉపాధ్యక్షుడు ఆర్.రవికుమార్, ఉపాధ్యక్షుడు కేకే మహేశ్వరి, ఐఐటీఈఎక్స్ 2025 కన్వీనర్ విమలేష్గుప్తా పాల్గొన్నారు.