31-01-2026 02:03:21 AM
మంచిర్యాల/లక్షెట్టిపేట టౌన్, జనవరి 30 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని మం చిర్యాల కార్పొరేషన్ తో పాటు బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీలకు అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. ఇది వరకే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కొన్ని వార్డులలో అభ్యర్థులను ఎంపిక చేసి బీ ఫాంలు అందివ్వగా మరి కొన్ని డివిజన్లు, వార్డులకు ఇంత వరకు అభ్యర్థుల ఎంపి క చేయకపోవడంతో ఎవరికి వస్తుందోనని తెలియక చాలా మంది అభ్యర్థులు ఆశతో నామినేషన్లు వేశారు. టికెట్లు ఆశించి భంగపడ్డ వారిలో కొంత మంది ఇతర పార్టీల్లో చేరుతుండగా, మరి కొంత మంది ఇండిపెండెంటుగా పోటీ చేసేందుకు వెనుకాడకుండా నామినేషన్లు దాఖలు చేశారు.
లక్షెట్టిపేటలో 157 నామినేషన్లు..
లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులకు వివిధ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ల పర్వం శుక్రవారం సాయంత్రంతో ముగిసిపోయింది. లక్షెట్టిపేటలోని పాత ఎంపీడీఓ కార్యాలయంలో మున్సిపల్ నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిసి మొత్తం 157 నామినేషన్లు దాఖలు చేశారు. సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి రాజకీయ పార్టీ నుంచి ఒక్కో వార్డుకు ముగ్గురు నుంచి నలుగురు వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం.