calender_icon.png 31 January, 2026 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే దానం అనర్హతపై స్పీకర్ విచారణ

31-01-2026 02:16:46 AM

  1. స్పీకర్‌కు నాగేందర్ పార్టీ మారిన వివరాలు అందజేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి  
  2. విచారణకు ఫిబ్రవరి 20 తర్వాత సమయం కోరిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి 
  3. ఫిబ్రవరి 18న విచారణ 

హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి) : పార్టీ ఫిరాయింపు కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణ జరిగింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వేసిన పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసా ద్‌కుమార్ శుక్రవారం  విచారణ చేపట్టారు. దానంపై అనర్హత వేటు వేయాలని కౌశిక్‌రెడ్డితోపాటు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ముందుగా పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిగింది. ఎమ్మెల్యే దానం తన న్యాయవాదులతో విచారణకు హాజరయ్యారు.

దానం తరఫున న్యాయవాదులు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దానంపై అనర్హత పిటిషన్ ఎందుకు వేశారు? పార్టీ మారాడని చెప్పేందుకు గల ఆధారాలు ఉన్నాయా? అని దానం తరఫు న్యాయవాదులు ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మె ల్యే తన వద్ద ఉన్న అధారాలను స్పీకర్‌కు అందజేశారు.

బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారని, కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఫొటోలను స్పీకర్‌కు అందజేశారు. దీంతో పాడి కౌశిక్‌రెడ్డి విచారణ స్పీకర్ ముందు ముగిసింది. పెండింగ్‌లో ఉన్న 3 అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు గతంలోనే వివరణ కోరింది. విచారణ జరిపి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. 

మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా విచారణకు రాలేను : మహేశ్వర్‌రెడ్డి 

ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి వేసిన అనర్హత పిటిషన్‌పై సాక్షాలను ఆయన తరఫున న్యాయ వాదులు స్పీకర్‌కు అందజేశారు. దానం నాగేందర్ అనర్హుడిగా ప్రకటించేందుకు ఆధారాలను పొందుపర్చినట్లు చెప్పా రు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాను వ్యక్తిగతంగా హాజరుకాలేనని మహేశ్వర్‌రెడ్డి తెలి పారు. వ్యక్తిగతింగా హాజరుకావాలంటే సమయం ఇవ్వాలని, ఫిబ్రవరి 20 తర్వాత అయితే విచారణకు హాజరవుతానని స్పీకర్‌కు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీంతో బీజే పీ పిటిషన్‌పై విచారణకు ఫిబ్రవరి 18 తేదీన స్పీకర్ సమయమిచ్చారు.  

దానంను సస్పెండ్ చేస్తారు..

ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌కు సంబంధించి స్పీకర్ ముందు ఆధా రాలను పెట్టామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మె ల్యేగా గెలిచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారని, ఇంతకంటే పెద్ద ఆధారం ఏముంటుందన్నారు. దానం నాగేందర్‌కు ఎంపీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, ఇతర డాక్యుమెంట్లు స్పీకర్‌కు అందజేసినట్లు చెప్పారు. వీటన్నింటిపైన విచారణ చేసిన తర్వాత దానం నాగేం దర్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.