ఒకే క్లిక్.. 8 లక్షల నోటీసులు
ఆస్తిపన్ను దారులకు డిమాండ్ నోటీసులు
8 లక్షల మందికి ఒకేసారి ఎస్ఎంఎస్
ఎస్ఎంఎస్ క్లిక్ చేస్తే ఆన్లైన్లోనే నోటీసు
రెండ్రోజుల్లో రూ. 4 కోట్లకు పైగా వసూలు
టాక్స్ వసూళ్లలో బల్దియా వినూత్న ప్రయోగం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 30 (విజయక్రాంతి) : హైదరాబాద్ మహానగరంలో ప్రాపర్టీ టాక్స్ వసూళ్లకు బల్దియా వినూత్న ప్రయాగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి దాకా ఇంటింటికీ తిరిగి ఆస్తి పన్ను వసూలు చేస్తున్న బల్దియా సిబ్బంది ఇక నుంచి ఆన్లైన్ ద్వారానే నోటీసులు అందజేసి టాక్స్ రాబట్టుకోవడానికి ప్రణాళికలు రచించింది. ఆస్తిపన్ను చెల్లింపుదారుల ఫోన్ నంబరుకు ఎస్ఎంఎస్ పంపుతూ టాక్స్ చెల్లింపుదారులను అలర్ట్ చేస్తున్నది.
నిర్మాణదారులకు వెళ్లే ఎస్ఎంఎస్లో ఉండే లింక్ను క్లిక్ చేయడంతో టాక్స్కు సంబంధించిన డిమాండ్ నోటీసు ఓపెన్ కానుంది. ఈ నోటీసులో ప్రాపర్టీ టాక్స్కు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉండనున్నాయి. అంతే కాకుండా, ఏ నెలలో పే చేస్తే టాక్స్ ఎంత మొత్తం అవుతుందో కూడా తెలుసుకునేలా ఆ డిమాండ్ నోటీసును బల్దియా రూపొందించింది. ఈ విధానం బల్దియా చరిత్రలోనే తొలిసారి ప్రయోగం చేసి, ఫలితాలు సానుకూలంగా రావడంపై అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఒకేసారి 8 లక్షల నోటీసులు
గ్రేటర్లో ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో ప్రతి ఏడాది రికార్డులను నమోదు చేస్తున్నది. 2023 ఏడాదిలో 19లక్షల మంది టాక్స్ పేయర్స్ ద్వారా రూ. 1921కోట్లు, ఈ ఏడాది 2024 ఎర్లీ బర్డ్ ద్వారా ఏప్రి ల్ మాసంలోనే రూ. 829 కోట్ల ఆదాయం బల్దియాకు సమకూరింది. ఈ రెండు విషయాలు గత ఏడాదితో పోల్చితే అత్యధికమే. వాస్తవానికి ప్రాపర్టీ ట్యాక్స్ ఏడాదిలో రెండుసార్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ చెల్లింపును మొదటి మూడు నెలల్లో చెల్లిస్తే ఎలాంటి వడ్డీ జమ కాదు. ట్యాక్స్ అనగానే ఇటు బల్ది యా అధికారులకు, అటు ఆస్తిపన్ను చెల్లింపుదారులకు సాధారణంగానే జనవరి, ఫిబ్ర వరి, మార్చి నెలల్లోనే చెల్లించాలనే ఉద్దేశం ఉంటుంది.
కానీ, జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటి టాక్స్ను అప్పుడే వసూలయ్యేలా ప్రణాళికలు వేశారు. ఈ ఏడాది ఎర్లీ బర్డ్ (5 శాతం రాయితీ) ద్వారా ట్యాక్స్ పే చేసిన వారిని మినహాయించి, మిగతా వారందరికీ డిమాండ్ నోటీసు వెళ్లేలా జీహెచ్ఎంసీ కమిషనర్, రెవెన్యూ, ఐటీ అడిషనల్ కమిషనర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ ఫలితంగా ప్రత్యేక ఎస్ఎంఎస్ విధానాన్ని రూపొందించారు. ఎర్లీబర్డ్ ద్వారా ఇప్పటికే 7.20 లక్షల మంది నిర్మాణదారులు ట్యాక్స్ను చెల్లించారు. మిగతా వారి నుంచి కూడా సకాలం లో ట్యాక్స్ వసూలు చేసేందుకు ఒకేసారి 8 లక్షల మంది నిర్మాణదారుల మొబైల్కు ఎస్ఎంఎస్ ద్వారా డిమాండ్ నోటీసులు పంపారు. ఫలితంగా రెండ్రోజుల్లో రూ. 4 కోట్ల ఆదాయం ఖాతాలో జమ కావడంపై అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఒకే క్లిక్తో పేమెంట్...
జీహెచ్ఎంసీ నిర్మాణదారులకు సెండ్ చేసిన డిమాండ్ నోటీసులోనే ట్యాక్స్ పేమెంట్కు అవకాశం ఉండేలా వెసులుబాటు కల్పించారు. టి వాలాట్, కార్డు, నెట్ బ్యాంకింగ్, యుపీఐ , ఎస్బిఐ ఈ ఐసిఐసిఐ గేట్ వే రూపాంలో ట్యాక్స్ పేమెంట్ చేసేందుకు అవకాశం ఉంది. అయితే, ఆన్లైన్ ద్వారా మాత్రమే డిమాండ్ నోటీసులు సెండ్ చేయడం వలన భవిష్యత్లో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రింటెడ్ నోటీసులను కూడా సిబ్బంది జారీ చేసేలా అధికారులు చర్యలు తీసకుంటున్నారు. బల్దియా రూపొందించిన ఈ ఎస్ఎంఎస్ విధానం ద్వారా చెల్లింపుదారుడికి సంబంధించిన ఆస్తిపన్ను వివరాలన్నీ ఉంటాయి.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మొదలు వచ్చే ఏడాది మార్చి దాకా నెలల వారీగా చెల్లింపు వివరాలుంటాయి. అంతే కాకుండా, ఆస్తి ఎంతటి విస్తీర్ణంలో ఉందో కూడా అధికారులు ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసు వెనుక వైపున సర్కిళ్ల వారీగా అధికారుల ఫోన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచుతున్నారు. జీహెచ్ఎంసీ పంపిన డిమాండ్ నోటీసులు వివరాలు తప్పుగా ఉన్నా.. నిర్మాణదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని సరిచేస్తామని ప్రాపర్టీ టాక్స్ విభాగం అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఖాళీ స్థలాలకు, నోటరీ ఆస్తులలో కూడా ఈ విధానం ద్వారానే ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయడానికి బల్దియా సన్నద్ధం అవుతున్నట్టుగా సమాచారం.






