27-11-2025 09:45:39 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): యాక్టివా వాహనం అదుపుతప్పి కిందపడి రోడ్డుప్రమాదంలో తీవ్ర గాయాలతో ఒకరు మృతిచెందిన సంఘటన పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర మండలం రాంపల్లి సుచిత్ర కాలనీకి చెందిన భూక్య మల్లేష్(34) తన స్నేహితుడు గుగులోతు శ్రీను(38) యాక్టివా వాహనంపై వెళ్లి మల్లేష్ కుమార్తెను శంషాబాద్ లోని హాస్టల్ వద్ద వదిలిన తర్వాత తిరిగి వస్తున్నారు. యంనంపేట్ సమీపంలోని అవుటర్ రింగ్ రోడ్ సర్వేస్ రోడ్డు చివరి పాయింట్ వద్ద అజాగ్రత్తగా నిర్లక్ష్యంతో వాహనం నడపడంతో అదుపుతప్పి కిందపడ్డారు. వాహనం నడుపుతున్న శ్రీనుకు గాయాలు కాగా మల్లేష్ కు తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని వెంటనే రాంపల్లిలోని సిరి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మల్లేష్ మృతి చెందినట్లు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.