24-01-2026 01:14:07 AM
తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఇందులో ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఏఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్లపై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మిస్తున్నారు.
బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా జనవరి 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ను స్టార్ హీరో విజయ్ దేవరకొండ శుక్రవారం లాంచ్ చేశారు.
పెళ్లిచూపుల్లో ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్)ని ఈషా రెబ్బా ‘మీరు లాస్ట్ చూసిన సినిమా ఏది?’ అంటూ అడిగే ప్రశ్నతో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇందులో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘మన గోదారోళ్లకి ఎటకారాలు సూటైనట్టు ప్రతీకారాలు సూటవ్వవు రా..’ వంటి డైలాగులతో బ్రహ్మాజీ కూడా నవ్వించారు. ఈ చిత్రానికి సంగీతం: జై క్రిష్; డీవోపీ: దీపక్ యెరగరా.