28-05-2025 11:19:39 PM
పనులు పూర్తి చేయడంలో ఇంత నిర్లక్ష్యమా..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంజూరైన పనులు అసంపూర్తిఫై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పంచాయతీ రాజ్ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... టెండర్ లు పూర్తి అయిన పనులు ఎందుకు చేయడం లేదని మండిపడ్డారు. వేసవిలో పనులు చేయకపోతే వర్షాకాలంలో ఎలా చేస్తారని ప్రశ్నించారు. కొంతమంది గుత్తేదారులకే కాంట్రాక్టులు పనులు అప్ప చెబితే కుదరదన్నారు. మనకోసం కాంట్రాక్టర్లు ఉన్నారా, కాంట్రాక్టర్ల కోసం మనం ఉన్నామా అంటూ అసహనం వ్యక్తం చేశారు.
టెండర్లు పూర్తి అయ్యి పనులు ప్రారంభించని కాంట్రాక్టులను రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు త్వరితగతిన పూర్తి చేస్తే కొత్త పనులకు అనుమతులు ఇస్తామన్నారు. వారంలోగా పనులలో పురోగతి చూపించాలని ఆదేశించారు. స్థానిక శాసనసభ్యులు పనుల పురోగతిపై సమీక్ష సమావేశాలు నిర్వహించాలన్నారు. కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయకపోతే వాళ్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. గిరిజనుల అభివృద్ధికి రోడ్లు, బ్రిడ్జిలు ముఖ్యంమని Ham పథకం ద్వారా ప్రతి గ్రామానికి కనెక్టివిటీ ఉండే విధంగా రోడ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు కోయ సామాజిక వర్గంలో నేను మాత్రమే మంత్రివర్గంలో ఉన్నాను. గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తాన్నని, నాకు అప్పగించిన శాఖల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.