21-07-2025 04:40:06 PM
సనత్నగర్ (విజయక్రాంతి): తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ(Constituency In-charge Dr. Kota Neelima) తెలిపారు. అందులో భాగంగానే పథకాల రూపకల్పన చేస్తున్నామన్నారు. టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్ లో న్యాయవాదుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కోట నీలిమ మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని తెలిపారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ దేశ ప్రజలతో మమేకం అయ్యారని చెప్పారు.
ఆ క్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల బాధలు కళ్లారా చూసారని తెలిపారు. ఆదివాసీల పరిరక్షణకు సైతం నడుం బిగించారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాజ్యాంగ పరిరక్షణకు ఆగస్టు 2న దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ నిపుణులతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి భారీ ఎత్తున న్యాయవాదులు తరలివస్తారని తెలిపారు. ఇందులో భాగంగా అట్టడుగు వర్గాల ప్రజల ఉన్నతికి సమాలోచనలు ఉంటాయన్నారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా దేశంలోని ముఖ్య నేతలు వస్తారని తెలిపారు. తెలంగాణలో రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పని చేస్తోందని పునరుద్ఘాటించారు.