01-05-2025 01:00:50 AM
అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ విద్యా చందన
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 30 (విజయ క్రాంతి): జిల్లావ్యాప్తంగా తాగునీటి సరఫరా లో తలెత్తే సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులను అదనపు కలెక్టర్ విద్యా చందన ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తాగునీరు, పారిశుద్ధ్యం అమలు , మరుగుదొడ్ల నిర్మాణం, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూగర్భ జలాల పెంపొందించేందుకుగాను జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్వాడి కేంద్రాలు, రైతు వేదికల్లో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించారు.
వైద్య శాఖ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, విద్యుదీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అంగన్వాడి కేంద్రాల్లో ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీలు, పిల్లలకు శానిటేషన్, పారిశుధ్యం పై అవగాహన కల్పించాలన్నారు.
వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలోని బోరు ద్వారా వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ పాండ్స్ నిర్మించాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా వాటి నిర్మాణం ఉచితంగా నిర్మించుకోవచ్చు అన్నారు. ఈ ఏడాది కనీసం పదివేల ఫామ్ పాంట్స్ నిర్మించేడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వైద్య శాఖ అధికారి భాస్కర్ నాయక్, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు ,భూగర్భ జలాల అభివృద్ధి శాఖ ఏడి రమేష్, ఇరిగేషన్ ఈ ఈ అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.