01-05-2025 12:38:39 AM
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 30 (విజయక్రాంతి): రాష్ట్రంలోని రైతాంగానికి భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోషం అన్నారు.
బుధవారం కోడేరు మండల కేంద్రoలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థ గోడౌన్ లో , కొల్లాపూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, నిషేధిత భూములు, ఆర్ఓఆర్ మార్పులు చేర్పులు వంటి సేవలు సులభతరం అవుతుందన్నారు. భూమి హక్కు అనేది గౌరవం, అత్మ విశ్వాసం, ధైర్యమన్నారు.
భూమి కొనుగోలు చేసిన పట్టాదారు రికార్డులో నమోదు కాక పోవడంతో రైతుకు రైతు బంధు, రైతు భరోసా రాలేదని సాగు చేసుకునే రైతు పేరు స్థానంలో ధరణిలోని ఇతరుల పేర్లు నమోదు అవుతున్నాయని అన్నారు. దాన్ని ఆసరా చేసుకుని తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలంటే మళ్ళీ డబ్బులు డిమాండ్ చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు.
ధరణి ద్వారా నష్టపోయిన రైతులకు న్యాయం చేసేందుకు భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు. పాస్ పుస్తకాల్లో సవరణలు నిర్దేశిత సమయంలోగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. గతంలో ఇచ్చిన దరఖాస్తులను, సాధా బైనామా దరఖాస్తులను భూ భారతి చట్టం ద్వారా పరిష్కరించబడతాయన్నారు.