20-09-2025 12:44:00 AM
కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 19: వంగమర్తి ఇసుక రీచ్ లో పూడిక ద్వారా తీసిన 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇండ్లు,ఇతర అభివృద్ధి పనులకు వినియోగించుకునేందుకు జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం తీర్మానించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
గత మే నెలలో నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో వంగమర్తి ముంపు ప్రాంతంలో సుమారు 8 లక్షలు ఇసుకను పూడిక తీత ద్వారా తీసుకొని ఇరిగేషన్ ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు వినియోగించుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఈ ఇసుకను ఇప్పటివరకు వినియోగించుకో నందున దాన్ని సద్వినియోగం చేసుకునే విషయమై కమిటీ చర్చించి ఐదున్నర లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను రాష్ట్రంతో పాటు, జిల్లాలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకునేలా నిర్ణయం తీసుకుంది .
ఈ ఇసుకను టీజీ ఎండీసీకి బదలాయించడం ద్వారా టీజీఎండిసి నుండి ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇండ్లు, సాండ్ బజార్ కు కేటాయించేలా తీర్మానించారు.దీంతోపాటు జిల్లాలో మరో ఐదు ఇసుక రీచ్ ల ను గుర్తించి వాటి ద్వారా ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఇచ్చేందుకు సమావేశం చర్చించింది.
చిట్యాల లో ఉన్న ఇసుక కొరతను తీర్చేందుకు వెంటనే అవసరమైన ఇసుకను సరఫరా చేసేందుకు తగు చర్యలు తీసుకునేలా సమావేశం ఆమోదించింది.రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మైన్స్ ఏ డి శామ్యూల్ జాకబ్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, గ్రౌండ్ వాటర్, టి జి ఎం డి సి అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.