20-09-2025 01:00:28 AM
భార్య, కుమారుడు నిందితులు
చివ్వెంల: ఓ వ్యక్తిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఇద్దరు వ్యక్తులను శుక్రవారం చివ్వెంల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను సూర్యపేట రూరల్ సీఐ జి.రాజశేఖర్ స్థానిక పోలీస్ స్టేషన్ విలేకరులకు వివరించారు. మండలంలోని కుడకుడ గ్రామంలో సురేష్ అనే ఓ లారీ డ్రైవర్ ఈనెల 17న మృతి చెందాడన్నారు. అయితే అతను కుటుంబ కలహాలు, మద్యపానం, ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని భార్య శైలజ ఫిర్యాదు చేసిందన్నారు.
దీంతో మొదటగా ఈ కేసు 194 బి ఎం ఎస్ ఎస్ కింద నమోదు చేయడం జరిగిందన్నారు. తదుపరి ఆయన మృతదేహం లో పోస్టుమార్టంకు తరలించగా వైద్యులు అది హత్యగా నిర్ధారించడం జరిగిందన్నారు. వెంటనే శైలజను అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె తన కుమారుడితో కలిసి సురేష్ గొంతుకు చున్నీ బిగించి హత్య చేసి, అనంతరం ఇనుప బొంగుకు వేలాడదీసి ఉరి వేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు ఒప్పుకుందన్నారు. దీంతో నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్ కు పంపామన్నారు.