పేటీఎంలో పింక్ స్లిప్లు..!
లేఆఫ్లు ప్రకటించిన పేటీఎం సంస్థ
నష్టాల నేపథ్యంలో ఉద్యోగులకు ఉద్వాసన
న్యూఢిల్లీ, జూన్ 10: పేటీఎం బ్రాండ్ పై ఆర్థిక సేవలు అందిస్తున్న వన్ 97 కమ్యూనికేషన్స్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. అయితే ఎందరిని ఉద్యోగాల నుంచి తొలగించారనే విష యం మాత్రం గోప్యంగా ఉంచారు. కంపెనీ పునర్ వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా ఉద్యోగ కోతలు చేపట్టాల్సి వచ్చిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఉద్యోగాలు కోల్పోయిన వారికి వేరే సంస్థల్లో ఉద్యోగాలు కల్పించడంలో వారికి సహాయం అందిస్తున్నామని వివరించింది. ఈ విషయంలో తమ హెచ్ఆ ర్ బృందం 30 కంపెనీలతో కలసి పనిచేస్తోందని పేర్కొంది.
భారీగా తగ్గిన ఉద్యోగులు..
2024 మార్చి నాటికి పేటీఎం సంస్థలో 36,521 మంది ఉద్యోగులు పనిచేస్తుండే వారు. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే ఈ సంఖ్య 3,500 వరకు తగ్గింది. పేటీఎం పేమెం ట్స్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంకు చర్యల నేపథ్యంలో పేటీఎం ఉద్యోగుల కోత చేపట్టింది. ఇప్పుడు మరోసారి ఉద్యోగులను ఇంటికి పంపాలని నిర్ణయించింది. పెండింగ్లో ఉన్న బోనస్లను కూడా వారికి విడుదల చేసింది. పారదర్శకంగా లేఆఫ్ల ప్రక్రియ చేపడుతున్నట్టు వెల్లడించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కంపెనీ నష్టాలు పెరిగాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.167 కోట్ల మేర నష్టాలు చవిచూసినట్టు కంపెనీ ప్రకటించింది. ఇక మార్చి త్రైమాసికంలో ఆ నష్టాలు రూ.550 కోట్లకు పెరిగాయి.






