14-06-2025 11:20:08 PM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
అమీన్ పూర్ లో ఘనంగా వన మహోత్సవం
పటాన్ చెరు: భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) అన్నారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని చక్రపురి కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మున్సిపాలిటీలలో నిర్వహిస్తున్న వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వన మహోత్సవం - మొక్కలు నాటుదాం కార్యక్రమానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాలతో పాటు పార్కులు, గేటెడ్ కమ్యూనిటీలు, దేవాలయాలు, పరిశ్రమల ఆవరణలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
శివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని చక్రపురి కాలనీలో రిటైర్డ్ ఉద్యోగులు తమ సొంత నిధులతో నిర్మిస్తున్న శివాలయాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. రాబోయే రోజుల్లో ఆలయ నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.