01-07-2025 01:51:16 AM
- కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, జూన్ 30: పీఎంజెజెబివై, ఎస్.బి.వై, ఏ.పీ.వై వంటి బ్యాంకు ఖాతాదారుల బీమా పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి అందరికీ బీమా చేయించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బ్యాంకర్లను, జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అతి తక్కువ ప్రీమియంతో రెండు లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉన్న పీఎం బీమా యోజన పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించాలని అన్నారు.
ప్రధానమంత్రి సూరజ్ ఘర్ ముక్త్ బిజిలీ యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లాలో ఒక రెవిన్యూ గ్రామాన్ని సోలార్ మోడల్ విలేజ్గా ఎంపిక చేయనున్నారని తెలిపారు. ఎంపికైన గ్రా మానికి కోటి రూపాయల నిధులు కేటాయించి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తారని తెలిపారు. భూభారతిలో వచ్చిన దరఖాస్తులకు సంబంధించి అర్జీదారులందరికీ నోటీసులు జారీ చేసి పరిష్కరించాలని తహసిల్దార్లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని గృహ నిర్మాణ శాఖ పీడిని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశా య్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డిఓలు మహేశ్వర్, రమేష్ బాబుపాల్గొన్నారు.