22-05-2025 01:12:48 PM
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ స్టేషన్ల(Amrit Bharat Station Scheme)ను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆపరేషన్ సిందూర్ పై మాట్లాడుతూ... ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) ద్వారా ఉగ్రవాదులను తుదముట్టించామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ పట్ల దేశ ప్రజలంతా గర్వపడుతున్నారని ప్రధాని వెల్లడించారు. మా ప్రభుత్వం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని తెలిపారు. త్రివిధ దళాలు చక్ర వ్యూహాలు పన్ని శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేశాయని చెప్పారు. పహల్గాం ఘటనకు జవాబుగా 23 నిమిషాల్లోనే ఉగ్రవాదులను మట్టుబెట్టామన్నారు.
మన మహిళల సింధూరం చెరిపిన వాళ్లను మట్టిలో కలిపేశామని తేల్చిచెప్పారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసభను రాజస్థాన్ వీరభూమిలోనే నిర్వహించడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అన్నారు. భారత్ లో రక్తపుటేర్లు పారించిన వాళ్లను ముక్కలు ముక్కలు చేశామని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్.. న్యాయానికి కొత్త రూపం.. ఆపరేషన్ సిందూర్ .. ఆక్రోశం కాదు.. సమర్థ భారత రౌద్ర రూపం అన్నారు. ఇక పై ఉగ్రదాడి జరిగితే భారత్ సమాధానం ఇలాగే ఉంటుందని ప్రధాని హెచ్చరించారు. ఉగ్రవాదులకు ఇకపై ఇలాంటి జవాబే దక్కుతుందని ప్రధాని స్పష్టం చేశారు. పాకిస్థాన్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మన ఎంపీలు విదేశాలకు వెళ్లారని ఆయన వెల్లడించారు. పాకిస్థాన్(Pakistan) నిజ స్వరూపాన్ని మన ఎంపీలు ప్రపంచానికి చాటుతారని ప్రధాని మోదీ వివరించారు.