15-11-2025 07:28:37 PM
- ఆరుగురు అరెస్ట్
- రూ. 20 లక్షల సొత్తు స్వాధీనం
కరీంనగర్ క్రైం,(విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా గ్రామీణ ప్రాంత పరిధిలో గత కొన్ని నెలలుగా రైతులు, పౌరుల ఆస్తులకు నష్టం కలిగించిన దొంగతనాల కేసులను జిల్లా పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ప్రధానంగా 12 కాపర్, కరెంట్ మోటార్ వైర్ దొంగతనాలు, 3 పశువులు, పందులు, గొర్రెలు-మేకల దొంగతనాల కేసులు, మొత్తం 15 కేసుల మిస్టరీని ఛేదించి, ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.
శనివారం చొప్పదండిలోని గుమ్లాపూర్ చౌరస్తా వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక బోలెరో క్యాంపర్, ఒక అశోక లేల్యాండ్ వాహనాలను ఆపి తనిఖీ చేయగా, ఈ దొంగతనాలలో పాల్గొన్న నిందితులు మనుపాటి శేఖర్ (36), మనుపాటి సంజీవ్ (26), ఉండాటి మహేశ్ (27), బోదాసు కుమార్(33), సాగర్ల రంజీత్(36), బొడిగే సంపత్ (42) లు పట్టుబడ్డారు. వారి నుంచి 20 లక్షల విలువైన ఒక బోలెరో వాహనం, ఒక అశోక లేల్యాండ్ వాహనం, ఒక మోటార్ సైకిల్, 3 క్వింటాళ్ల కాపర్ వైరు స్వాధీనం చేసుకున్నారు.
రూరల్ ఏసిపి జి. విజయ కుమార్ ఆధ్వర్యంలో చొప్పదండి సీఐ ఏ. ప్రదీప్ కుమార్, మానకొండూరు సిఐ సంజీవ్, ఎస్సైలు నరేష్ రెడ్డి, వంశీ కృష్ణ, సిబ్బంది అనిల్, రాజ్ నాయక్, హేమసుందర్, శ్రీనివాస్, హసనోద్దీన్, రవీందర్ సి.సి.ఎస్., సృజన్ తదితరులు చేదించారు. వీరిని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం అభినందించారు. పట్టుబడిన నిందితులపై సంబంధిత సెక్షన్ల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుని రిమాండ్కు తరలించనున్నామని తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన 8 మంది నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సిపి తెలిపారు.