04-10-2025 08:19:29 PM
- కోర్టులను అడ్డంపెట్టుకుని బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తే రాష్ట్రంలో అగ్గి రాజేస్తాం
- బీసీ రిజర్వేషన్లు చట్టాన్ని గవర్నర్ ఆమోదింపచేసే బాధ్యత బిజెపిదే
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్
నల్గొండ రూరల్: బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులకు రాజకీయ సమాధి చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు నల్గొండలో బీసీ భవన్ లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టులను అడ్డంపెట్టుకుని బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తే రాష్ట్రంలో అగ్గి రాజేస్తామని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని గవర్నర్ ఆమోదింపచేసే బాధ్యత బిజెపిదే అన్నారు. రాష్ట్ర జనాభాలో 60 శాతంకు పైగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం కల్పించగా అడ్డుకోవాలని చూడడం సరైనది కాదన్నారు.
బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే భవిష్యత్తులో బీసీలంతా ఒక్కటై రాజకీయంగా సమాధి చేస్తామని హెచ్చరించారు.ఉన్న జనాభా కంటే 18 శాతం రిజర్వేషన్లు తక్కువ చేసి 42 శాతంతో బీసీలకు సరిపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ, రెడ్డి జాగృతికి చెందిన వారు రాష్ట్ర హైకోర్టులో బీసీ రిజర్వేషన్లు చెల్లవంటూ కోర్టులకు వెళ్లారని, ఐదు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు గత 80 ఏళ్లుగా 90 శాతం పదవులు అనుభవిస్తూ బీసీల రావలసిన వాటాను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.
ఈనెల 8వ తేదీన రాష్ట్ర హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలు జరగవంటూ బీసీ రిజర్వేషన్ల అమలు కావంటూ కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారని దీన్ని సహించబోమని హెచ్చరించారు. 50 శాతం సామాజిక రిజర్వేషన్లు దాటకూడదని ఎక్కడ లేదని అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన నాడే 50 శాతం సీలింగ్ తెలి పోయిందని, బీసీలకు రిజర్వేషన్లు పెంచినప్పుడే 50% సీలింగ్ గుర్తుకు రావడం చాలా శోచనీయమన్నారు. బీసీలకు రావాల్సిన వాటాను అగ్రవర్ణాలు తన్నుకపోతే చూస్తూ ఊరుకోమని, బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకుల భరతం పట్టడానికి బీసీలంతా ఐక్యమై రాష్ట్రంలో అగ్గి రగిలిస్తామని హెచ్చరించారు.
బీసీ రిజర్వేషన్ల పెంచడానికి రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బిజెపి అధిష్టానానికి కలిసి విన్నవించామని బీసీ రిజర్వేషన్లకు గవర్నర్ ఆమోదముద్ర వేసే బాధ్యత బిజెపి పార్టీ తీసుకోవాలని లేని పక్షంలో రిజర్వేషన్ల పెంచే బాధ్యత బిజెపి తీసుకోవాలని, రిజర్వేషన్లు ఆగిపోతే దానికి బిజెపిదే బాధ్యత వహించాలన్నారు.బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పెంపుపై అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలబడాలని, బీసీ రిజర్వేషన్ల అడ్డుకోవాలని రెడ్డి జాగృతి చూస్తుంటే వివిధ రాజకీయ పార్టీలో ఉన్న రెడ్డిలు ఎందుకు ఖండించడం లేదని రెడ్డిలు ఎటువైపో తేల్చుకోవాలన్నారు.