calender_icon.png 5 January, 2026 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బలమైన వాదనలు వినిపించండి

05-01-2026 01:21:08 AM

  1. ‘నల్లమలసాగర్’పై న్యాయ నిపుణులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచన
  2. ముంబైలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి 
  3. సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ సింఘ్వితో భేటీ నేడు సుప్రీంకోర్టులో విచారణ

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి) : గోదావరిపై ఏపీ తలపెట్టిన పోలవరం నల్లమల్లసాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. ఈ ప్రాజె క్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.

ఈ నేపథ్యంలో సీఎం రేవం త్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ముంబై లో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వితో ప్రత్యేకంగా సమావేశమై పలు సూచనలు చేశారు.  అవసరమైన అన్నిఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. అనుమతులు లేకుండా పోలవరం నుంచి బనకచర్ల లేదా నల్లమల సాగర్‌కు లింక్ చేసేందుకు ఏపీ ప్రభు త్వం చేపడుతున్న విస్తరణ పనులను నిలిపివేయాలని కోరుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.

క్షణమే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ పనులు ఆపేలా సుప్రీంకోర్టు ఆదేశించాలని  పలు అంశాలను ప్రస్తావించింది. మొదట్లో ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టు పనుల స్వరూపం ఉండాలని,  విస్తరణ పనులు చేపట్టడం చట్టబద్ధం కావని ఈ పిటిషన్ లో స్పష్టం చేసింది. తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా నల్లమలసాగర్ ప్రాజెక్టు ప్రీ ఫిజిబులిటీ రిపోర్టులను కేంద్ర ప్రభుత్వం పరిశీలించటం సమంజసం కాదని అభ్యంతరం తెలిపింది.

అందుకు సంబంధించి  కేంద్ర జల సంఘం, కేంద్ర జల మంత్రిత్వ శాఖ, గోదావరి నీటి యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలివ్వా లని కోరింది. కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం డీపీఆర్ తయారీకి సిద్ధపడుతోందని, వెంటనే ఈ చర్యలను ఆపాలని కోరింది. ఏపీ తలపెడుతున్న ఈ విస్తరణ ప్రాజెక్టులకు పర్యా వరణ అనుమతులు ఇవ్వకుండా, కేం ద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో ప్రస్తావించింది.