26 February, 2026 | 6:44 AM

అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ

25-02-2026 12:00 AM

కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ఇంటికి మహిళ గృహలక్ష్మీ, కావున మహిళకు అవగాహన కల్పించడం వల్ల రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని సదుద్దేశంతో జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుంది. మంగళవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ఆలోచన మేరకు ప్రారంభమైన కార్యక్రమం ‘అరైవ్ ఆలైవ్ 2.0’ లో భాగంగా పట్టణంలోని అంగన్వాడీ, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, మెప్మ సిబ్బందికి రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథులుగా పాల్గొని మహిళలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యా ర్థులు వారి నృత్య ప్రదర్శన ద్వారా ట్రాఫిక్ నియమాలపై, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేలా చక్కటి ప్రదర్శన ఇచ్చారు.   

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాలలో పట్టణాలలో మహిళలు మీటింగ్ జరుగుతున్న సందర్భంలో రోడ్డు ప్రమాదాలపై ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలన్నారు. వాహనదారులు హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించాలని తెలిపారు. మహిళలు తలుచుకుంటే ప్రతి ఒక్కటి సాధ్యమని, ప్రమాదాల నివారణ మహిళలు ఆధిపత్యంతో సాధ్యమవుతుందని తెలిపారు.  

హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించాలి

ప్రతి ఒక్కరు హెల్మె ట్ ధరించేలా, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించగా వాహనం నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. అదేవిధంగా అన్ని మండల కేంద్రాలలో మహిళలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం తమవంతు కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా మహిళలు గృహలక్ష్మిగా పాత్ర పోషిస్తుంటారని కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రమాదం రాకుండా పర్యవేక్షించాలంటే వారు సమాజ భద్రతలో, కుటుంబ భద్రతలో కీలక పాత్ర పోషిస్తూ తమ కుటుంబ సభ్యుల ప్రాణ రక్షణకు ట్రాఫిక్ నియమాలు పాటించేలా కృషి చేయాలని తెలిపారు.

కుటుంబ సభ్యులు ప్రతిరోజు వాహనంపై బయటకు వెళ్తున్న సమయంలో హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మౌనిక,  మెప్మా పీడీ సివిఎన్ రాజు, డిఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు నాగరాజు, కర్రె స్వామి, ప్రణయ్ కుమార్, పోలీస్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.