బిజెపి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
ముకరంపుర,(విజయక్రాంతి): రాష్ట్ర సాధన ఉద్యమ దిక్సూచి ప్రొఫెసర్ జయశంకర్ అని బిజెపి జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం కొనియాడారు. బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను నిర్వహించారు. టవర్ సర్కిల్లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, బిజెపి నాయకులు కార్యకర్తలు కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం పడిన తపన, అందించిన మార్గదర్శకత్వం ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చివరి వరకు నరనరాన జీర్ణించుకుని, యువతను, విద్యార్థులను ఉద్యమం వైపు నడిపించిన గొప్ప సిద్ధాంతకర్త అని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ చూపిన బాటలో నడవడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల రమేష్, కార్పొరేటర్ వంగల పవన్, వాసాల రమేష్ , చంద్రశేఖర్, జితేందర్,కో ఆప్షన్ బల్విందర్ సింగ్,కన్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు.






