ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలం గుండంపల్లి, ముత్యంపేట గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ దప్పుల పద్మా నర్సయ్య ఆధ్వర్యంలో గురువారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శిశువుల ఆరోగ్యానికి తల్లిపాల ప్రాధాన్యతను వివరించారు. ప్రతి తల్లి ప్రసవం అనంతరం శిశువుకు వెంటనే ముర్రిపాలు ఇవ్వాలని, తల్లిపాలే శిశువుకు సంపూర్ణ ఆహారమని, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కవిత, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా ముత్యంపేట అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ శ్రీలత మాట్లాడుతూ.. పుట్టిన శిశువుకు రెండు గంటలలోపు ముర్రిపాలు పట్టించడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, పలు అనారోగ్య సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని తెలిపారు. అనంతరం గర్భిణులు, బాలింతలకు సర్పంచ్ నరేష్ సరుకులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మురళి, ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.






