22-07-2024 12:44:12 PM
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ అంశంపై పార్లమెంట్లో విపక్షాలు నిరసనకు దిగాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ప్రతిపక్షాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. విపక్ష ఆరోపణలకు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్ ఇచ్చారు. నీట్ పరీక్షను యూపీఏ ప్రభుత్వమే తీసుకొచ్చిందన్న కేంద్ర మంత్రి అన్నారు. నీట్ పేపర్ లీక్పై సీబీఐ విచారణ జరుపుతోందని వెల్లడించారు. ఈ విషయంపై ధర్మేంద్ర ప్రధాన్కు రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. పేపర్లీక్ చాలా పెద్ద సమస్య.. ధర్మేంద్ర ప్రధాన్ అందరినీ తప్పుపడుతున్నారని ఫైర్ అయ్యారు. డబ్బున్నోళ్లు విద్యావ్యవస్థనే కొనేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
నీట్ వివాదంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు ధర్మేంద్ర ప్రధాన్ బదులిచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, భారతీయ పరీక్షా విధానం మోసపూరితమైనదని దేశంలోని లక్షలాది మంది విద్యార్థులు విశ్వసిస్తున్నారని అన్నారు. "ధనవంతులైతే పరీక్షా విధానాన్ని కొనుక్కోవచ్చని లక్షలాది మంది నమ్ముతున్నారు. ప్రతిపక్షంలో కూడా ఇదే భావన. ఈ సమస్యను పరిష్కరించేందుకు మీరు ఏమి చేస్తున్నారు?" అని రాహుల్ ప్రశ్నించారు.
ఆయనపై విద్యాశాఖ మంత్రి స్పందిస్తూ, పరీక్షా విధానం మోసపూరితమైనదని గాంధీ చేసిన ప్రకటన దురదృష్టకరమని అన్నారు. పరీక్షలో కాపీయింగ్ను అరికట్టడానికి చట్టం తీసుకురావడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం విఫలమైందని ఆయన దాడి చేశారు. రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రభుత్వాన్ని నడిపిన వారు మూడు బిల్లులు తెచ్చారన్నారు.