07-01-2026 01:24:00 AM
ముషీరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): పెండింగ్లో ఉన్న విద్యారంగం, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం మరోసారి ఐక్య ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పిసి) స్టీరింగ్ కమిటీ ప్రకటించింది. యుయస్పిసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం మంగళవారం టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో సిహెచ్. అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగింది. టిఎస్ యుటిఎఫ్, టిపిటిఎఫ్, డిటిఎఫ్, ఎస్సీ ఎస్టీ టిఎఫ్, టిటిఎ, ఎస్సీ, ఎస్టీ యుయస్, ఎంఎస్టీఎఫ్, బిటిఎఫ్ రాష్ట్ర నాయకులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న 5 డిఎల గురించి మాట్లాడటం లేదన్నారు. డిసెంబర్లో ఇస్తానన్న డిఎ ఇవ్వలేదన్నారు.
వారంలో ఇస్తామన్న నగదు రహిత వైద్య పథకం మూడు నెలలు గడిచినా కార్యరూపం దాల్చలేదు. వారి ఆందోళనను దృ ష్టిలో ఉంచుకుని తక్షణమే ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని ఉద్యోగులు, ఉపాధ్యా యులు, పెన్షనర్లు, కార్మికుల ఐక్య వేదిక(జెఎసి)ను కోరాలని యుయస్పిసి నిర్ణయించి నట్లు స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సమావేశంలో చావ రవి, ఎ. వెంకట్ (టిఎస్ యుటిఎఫ్), ఎన్. తిరుపతి (టిపిటిఎఫ్), ఎం. సోమయ్య, టి. లింగారెడ్డి (డిటిఎఫ్), జాడి రాజన్న (ఎస్సీ ఎస్టీ టిఎఫ్), ఎస్. హరికృష్ణ, వి. శ్రీను నాయక్ (టిటిఎ), వై. విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.