04-07-2025 12:00:00 AM
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): బనకచర్ల ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి నడవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ స్పష్టం చేశారు. బనకచర్ల కోసం చంద్రబాబుపై యు ద్దం చేయాల్సింది పోయి బీఆర్ఎస్ పార్టీపై రేవంత్ యుద్ధంచేస్తున్నారని మండిపడ్డారు.
గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడు తూ రేవంత్ రెడ్డి తనకుర్చీ కాపాడుకునేందుకు బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. తెలంగాణకు నష్టం జరిగితే ప్రజలతో కలిసి యుద్ధం చేయడానికి సిద్ధంగా తాము ఉన్నామన్నారు. బనకచర్లపై అపెక్స్ కౌన్సిల్ ఎందుకు నిర్వహించలేదని సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ఏకమై బీఆర్ఎస్పై దాడి చేస్తున్నాయని ఆరోపించారు.
తెలంగాణ ప్రజలపైన, నీళ్లపైన దాడి జరుగుతోందన్నారు. తెలంగాణ పట్ల మోసపూరితంగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోలేదని చంద్రబాబు అబద్దాలు చెప్తున్నారని సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు చంద్రబాబును సమర్థించే విధంగా మాట్లాడుతున్నాయని విమర్శించారు. రేవంత్రెడ్డి కంటే ఎక్కువ బూతులు మాట్లాడాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని సంజయ్ ధ్వజమెత్తారు.
తెలంగాణకు వస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ గురించి మాట్లాడాలని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. స్పీకర్ అనే విషయం మర్చిపోయి పార్టీ కార్యక్రమాల గురించి ప్రసాద్ కుమార్ మాట్లాడుతున్నారని విమర్శించారు. స్పీకర్పై గవర్నర్, లోక్సభ స్పీకర్, రాష్ర్టపతికి ఫిర్యాదు చేస్తామన్నారు.