calender_icon.png 7 September, 2025 | 4:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో నిర్బంధ పాలన

05-09-2025 12:00:00 AM

  1. సీఎం పర్యటనకు వెళ్తే మా నేతలను అరెస్టు చేయాలా?
  2. బీఆర్‌ఎస్ నాయకులు దేవీ ప్రసాద్
  3. కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం: పల్లె రవికుమార్

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు నిర్బంధం కొనసాగుతోందని బీఆర్‌ఎస్ నాయకులు దేవీ ప్రసాద్ అన్నా రు. సీఎం పర్యటనలకు వెళితే చాలు బీఆర్‌ఎస్ నేతలను గృహనిర్బంధం చేస్తున్నారని విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి పర్యటనకు సీఎం వెళ్తున్నారంటే బీఆర్‌ఎస్ నేతలు గంప గోవర్ధన్, జాజుల సురేందర్ తదితరులను హౌస్ అరెస్ట్ చేశారని, వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్ని నిర్బంధాలు పెట్టినా కాంగ్రెస్ హామీలు నెరవేర్చేదాకా బీఆర్‌ఎస్ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. జై తెలంగాణ స్పృహ లేకనే రేవంత్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేక పాలన చేస్తున్నారని విమర్శించారు. పార్టీ గీత దాటుతుందని కవితను కేసీఆర్ సస్పెండ్ చేశారని స్పష్టం చేశారు. కాంగ్రె స్, బీజేపీలు అన్ని ప్రాంతీయ పార్టీల్లో చిచ్చు పెట్టాలనుకుంటున్నాయని ఆరోపించారు.

కాళేశ్వరంలో అవినీతిని ఏజెన్సీలే తేల్చలేక పోయాయని, కవిత లాంటి వ్యక్తి తేలుస్తారా అని ప్రశ్నించారు. హరీష్ రావు తెలంగాణ ప్రజలకు 108 అంబులెన్స్ వంటివారని పోల్చారు. బీఆర్‌ఎస్ నేత పల్లె రవికుమార్ మాట్లాడుతూ.. రాష్ర్టంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందన్నారు. బీఆర్‌ఎస్ తెలంగాణకు రక్షణ కవచమని, తెలంగాణ అస్థిత్వానికి ప్రతీక అని స్పష్టం చేశారు. సీబీఐ విచారణ మోడీ మెప్పు కోసమేనా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో గాంధీ నాయక్, బొమ్మెర రామమూర్తి పాల్గొన్నారు.