16-12-2024 05:23:07 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): నిషేధిత మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ ఇటీవల జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన 07గురు సభ్యులకు ప్రభుత్వం నుండి మంజూరైన రివార్డు నగదులను సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అందజేశారు. ఎస్పీ కార్యాలయంలో చెక్కు రూపంలో రివార్డు నగదులను అందజేశారు.
రివార్డు నగదు పొందిన సభ్యుల వివరాలు...
1. పోడియం మంగు అలియాస్ దేవేందర్, 24yrs, తుమ్రేల్ గ్రామం, పామేడు పోలీస్ స్టేషన్ పరిధి, బీజాపూర్ జిల్లా 4,00,000/- రూపాయలు
2. మడకం అడిమె అలియాస్ అనూష, 23yrs, కొరకట్పాడు గ్రామం, చర్ల మండలం 4,00,000/- రూపాయలు
3. కోరం సోమయ్య అలియాస్ సోమ, 20yrs, గొల్ల గుప్ప గ్రామం, ఎటపాక, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్ 1,00,000/- రూపాయలు
4. సొడ్డి పొజ్జి అలియాస్ చిలుక, 25yrs, డోకుపాడు గ్రామం, కిష్టారం పిఎస్, సుకుమా జిల్లా 4,00,000/- రూపాయలు
5. మడివి సోమిడి అలియాస్ రమ్య, 22yrs, డోకుపాడు గ్రామం కిష్టారం పిఎస్, సుకుమా జిల్లా 4,00,000/- రూపాయలు
6. మడకం ఇడుమయ్య అలియాస్ మహేష్, 22yrs, అడవిరామారం గ్రామం ఆళ్లపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 1,00,000/- రూపాయలు
7. వ్యక్తి లక్ష్మయ్య అలియాస్ కల్లు 22yrs, కిష్టారంపాడు గ్రామం, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 1,00,000/- రూపాయలు
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ 2023-2024 సంవత్సరాల కాలంలో లొంగిపోయిన 26 మంది సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం నుండి మంజూరైన రివార్డు నగదులను వారి పునరావాసం కోసం అందజేయడం జరిగిందని తెలియజేసారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో స్వార్థ ప్రయోజనాల కోసం మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు అమాయకులైన ఆదివాసీలను బలవంతంగా తమ పార్టీలోకి చేర్చుకుంటూ వారి చేత చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయిస్తున్నారని తెలిపారు. లొంగిపోయిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యులకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు.
నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన నాయకులు, సభ్యులు ఆయుధాలను వీడి ప్రజాస్వామ్యబద్దంగా ప్రజల హక్కుల తరుపున పోరాడాలని కోరారు. లొంగిపోయి సాధారణ జీవనం గడపాలనుకునేవారు తమ బంధుమిత్రుల ద్వారా గానీ, స్థానిక పోలీస్ అధికారుల ద్వారా గానీ లేదా స్వయంగా జిల్లా ఎస్పీ గారి ఎదుట గాని లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను త్వరితగతిన అందేలా పోలీస్ శాఖ తరపున చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్, దుమ్ముగూడెం సిఐ అశోక్, చర్ల సీఐ రాజువర్మలు పాల్గొన్నారు.