రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం: 21మంది మృతి
- టిప్పర్ ఆర్టీసీ బస్సు ఢీ: 21 ప్రయాణికులు దుర్మరణం
- ఘటనాస్థలంలో మిన్నంటిన రోదనలు
- ఆస్పత్రిలో బాధితులకు కొనసాగుతున్న చికిత్స.
- చేవెళ్ల ఆస్పత్రిలో పోస్టుమార్టం.
- బంధువులకు మృతదేహాలను అప్పగించనున్న అధికారులు.
- రంగారెడ్డి, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా(Rangareddy district) చేవెళ్ల నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు, టిప్పర్ డ్రైవర్లు సహా 21 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరో 19 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘటన జరిగింది. ప్రమాద సమయంలో టిప్పర్ లారీ బస్సును బలంగా ఢీకొట్టడంతో టిప్పర్ లో ఉన్న కంకర లోడు మొత్తం ప్రయాణికులపై పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులోనే ఊపిరాడక కూరుకుపోయారు. స్థానికుల దార విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మూడు జేసీబీల సాయంతో ప్రస్తుతం సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. గాయపడిన పలువురు ప్రయాణికుల పరిస్థితి ప్రస్తుతం విషమంగా మారడంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది.
తాండూరు నుంచి హైదరాబాద్ కు...
ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 72 మంది ప్రయాణికులు ఉన్నారు. తెల్లవారుజామున కావడంతో పలువురు ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు హైదరాబాద్ కు వస్తున్నారు. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు హైదరాబాద్ లోని పలు కళాశాలల్లో చదువుతున్నట్లు సమాచారం. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి.. తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్- బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలిసిన పలువురు వివిధ పార్టీల నేతలు ఘటన స్థలానికి తరలివచ్చారు. పోలీసులతో కలిసి స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్యపై స్థానికుల నిరసన
మీర్జాగూడ టీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాద స్థలానికి చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య వచ్చినప్పుడు కోపంతో ఉన్న స్థానికులు ఆయనపై నిరసన తెలిపారు. ఈ ప్రాంతంలో నిరంతర మౌలిక సదుపాయాల వైఫల్యాలు, రహదారి భద్రతపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కల్లె యాదయ వైపు ప్రజలు రాళ్ళు ఎత్తడంతో ఉద్రిక్తత నెలకొంది. దీనితో ఆయన భారీ పోలీసు రక్షణలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. జనం తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండగా, "ఎమ్మెల్యే డౌన్ డౌన్" అంటూ నినాదాలు చేశారు. ఈ రోడ్డుపై పరిస్థితులు సరిగా లేకపోవడంతో స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ రోడ్డులో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వారు తెలిపారు. తీవ్ర ఘర్షణ తర్వాత, కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రమాద స్థలం నుండి కారు ఎక్కి అక్కడి నుండి వెళ్లిపోయారు.




