03-11-2025 03:08:51 PM
హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా మన్నేవారిపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన నీటిపారుదల రంగానికి సంబంధించిన శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (SLBC) సొరంగం పనులను పునరుద్ధరించేందుకు జరుగుతున్న హెలీ మాగ్నటిక్ సర్వేకు సిద్ధంగా ఉన్న సర్వే హెలికాప్టర్ ను ప్రత్యేకంగా పరిశీలించారు. ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకం పనుల పునరుద్ధరణలో భాగంగా సర్వే నేటి నుంచే ప్రారంభం కానుంది. ఈ సర్వే ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో మాగ్నటిక్ జియోఫికల్ సర్వే హెలికాప్టర్ కు అమర్చిన స్పెషల్ ట్రాన్స్ మీటర్ ద్వారా నిర్వహిస్తుంది. హైటెక్ సర్వే పద్ధతిలో భూమి లోపల షీర్ జోన్ లు, నీటి ప్రవాహాల గుర్తింపులను, అలాగే భూమిలో వెయ్యి మీటర్లలోతు వరకు జియోలాజికల్ డేటా సేకరిస్తుందని అధికారులు రేవంత్ రెడ్డికి వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అధికారులు, తదితరులు ఉన్నారు.