20-12-2025 09:45:54 PM
రోడ్డు ప్రమాదాల నివారణకు యువత, విద్యార్ధులు, ప్రజలలో అవగాహన కల్పించాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి,(విజయ క్రాంతి): రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్గా, రోడ్లు & భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సమావేశానికి అన్ని లైన్ డిపార్ట్మెంట్ల అధికారులు హాజరయ్యారు. జిల్లాలో రోడ్డు భద్రతను మెరుగుపరచడం, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ట్రాఫిక్ నియమాల అమలు, బ్లాక్ స్పాట్ల గుర్తింపు, తక్షణ సవరణ చర్యలపై విస్తృతంగా చర్చించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ప్రజల భద్రతే లక్ష్యంగా రోడ్డు భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. అంతకుముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, సంబంధిత శాఖల ఉన్నతాధికారుల హాజరయ్యారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతా చర్యలు, బ్లాక్ స్పాట్ల గుర్తింపు, ట్రాఫిక్ నియమాల కఠిన అమలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో శాఖల మధ్య సమన్వయం తో పనిచేసి ప్రమాదాలను తగ్గించాలని రాష్ట్ర స్థాయి అధికారులు సూచించారు.
ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా రోడ్డు భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని జనవరి లో జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి జిల్లాలో రోడ్డు భద్రత ఫోర్స్ వాలంటీర్స్ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు.ప్రతి నెల జిల్లా కలెక్టర్ ల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో రోడ్ సేఫ్టీ కమిటీల సమావేశం నిర్వహించాలని ప్రతి జిల్లాలో రవాణా శాఖ, ఆర్టీసీ, పోలీస్, ట్రాఫిక్, విద్యా శాఖ, వెల్ఫేర్ అధికారులు సమన్వయం చేసుకొని రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహించాలనీ మంత్రి తెలిపారు.రోడ్డు నిబంధనలపై విద్యార్థులకు, డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించి రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి మరణాల రేటును నివారించడమే లక్ష్యంగా జనవరి మాసంలో జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
గత సంవత్సరం తెలంగాణ లో 25,934 రోడ్డు ప్రమాదాలు జరగగా ,7949 మరణాలు జరిగాయని ప్రమాదాలకు ప్రధాన కారణం రోడ్డు నిబంధనలు ఉల్లంఘించి రాష్ డ్రైవింగ్ , డ్రైవర్ నిరక్ష్యం వల్లే జరిగినట్లు గుర్తించామని ప్రమాదాలను నివారించడానికి రోడ్డు నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ రోడ్డు నిబంధనలపై ప్రజలకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల పై అవగాహన కల్పించాలని రోడ్డు సేఫ్టీ పై ప్రతి జిల్లాలో ఏర్పడిన రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ లకు సూచించారు. ప్రతి జిల్లాలో రోడ్ భద్రతా ఫోర్స్ వాలంటీర్ బృందాలను ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో, పాఠశాలల్లో అధికారులతో కలిసి ఈ టీం అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఈ బృందాలకు జనవరి 26 న ప్రశంస పత్రాలతో సత్కరించాలని, పాఠశాలల్లో రోడ్డు నిబంధనలపై పిల్లలకు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేస్తున్న చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ లు చొరవ తీసుకోవాలని సూచించారు. యూనిసెఫ్ సహకారంతో విద్యార్థులకు ట్రాఫిక్ అవేర్నెస్ పై పాఠ్యాంశాలు చేర్చడం జరుగుతుందని తెలిపారు. కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి ,డ్రైవింగ్ లైసెన్స్ పొందిన ప్రతివారికి రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించాలని స్క్రాపింగ్ పాలసీ ద్వారా ఫిట్నెస్ లేని వాహనాలను తొలగించడం జరుగుతుందన్నారు.
ప్రమాదాలు జాతీయ రహదారుల పైనే అధికంగా అవుతుండడంతో రాత్రి వేళ వాహనాల పార్కింగ్ , వాహనాల బ్రేక్ డౌన్ సమయంలో రేడియం రిఫ్లెక్టర్లు ఉండేలా చూసుకోవాలని , వాహనదారుల్లో క్రమశిక్షణ పెంచడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారుల్లో ప్రధాన నగరాల్లో ఎన్ఫోర్స్మెంట్ చేసి నిబంధలను ఉల్లంఘించే వారికి చలానాలు , వాహనదారులు హెల్మెట్ లు ధరించేలా చేయడం ,సీటు బెల్ట్ పెట్టుకునే విధంగా చేయడం , ట్రిపుల్ రైడింగ్,మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపేవారి పై చర్యలు తీసుకోవడం వల్ల ప్రమాదాలు తగ్గించవచ్చన్నారు.
రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు గోల్డెన్ అవర్ లో చికిత్స అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యాష్లెస్ ట్రీట్మెంట్ సమర్థవంతంగా అమలు చేస్తుంది దీని ద్వారా బాధితుడికి ఏడు రోజుల్లో లక్షా 50 వేల వరకు ఉచితంగా అందజేయబడును. రోడ్డు ప్రమాద బాధితులను తక్షణ సహాయం అందించిన వాహనదారులను ప్రోత్సహించడానికి రహవీర్ గుడ్ సమర్థన్ స్కీమ్ ద్వారా 25 వేల్ క్యాష్ అవార్డు తో అందించే పథకం రాష్ట్రంలో త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు.2026 జనవరి లో జరిగే రోడ్డు భద్రతా మాసోత్సవాలు హెల్మెట్ బైక్ ర్యాలీలు, వాక్ థన్ పరుగులు , రంగోలి ముగ్గుల పోటీలు , రోడ్డు భద్రత ప్రతిజ్ఞలు , ఆరోగ్య శిబిరాలు , రక్తదాన శిబిరాలు ,మోటార్ సైకిల్ చిన్న హెల్మెట్ స్టిక్కర్ అతికించడం ద్వారా అవగాహన కల్పించడం , కారు విండ్ స్క్రీన్కు చిన్న సీట్ బెల్ట్ను అతికించడం ద్వారా అవగాహన కల్పించడం ,అన్ని పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు - సమావేశాలు, వ్యాస రచన పోటీలు, డ్రాయింగ్ పోటీలు, వక్తృత్వ పోటీలు, రోడ్లపై NCC బృందాల ద్వారాఅవగాహన , ఆడియో విజువల్ మార్గాల ద్వారా అవగాహన ,స్థానిక రేడియో సిటి కేబుల్స్లో రోడ్డు భద్రత చర్చలు ,సినిమా థియేటర్లలో అవగాహన స్లైడ్లువీడియోలు ,
హోర్డింగ్ల ద్వారా అవగాహన , కళాకారుల బృందాల చేత అవగాహన ఆర్టీసీ బస్సు కండక్టర్ల ద్వారా కరపత్రాల పంపిణీ, బస్టాండ్లలో హోర్డింగ్లు, డిస్ప్లేలు అనౌన్సర్ల ద్వారా అవగాహన ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ లకు సూచించారు. అధిక ప్రమాదకర కారిడార్లు ,బ్లాక్ స్పాట్ లని గుర్తించి వాటిని తొలగించాలని అవసరమైన చోట ప్రధానంగా రోడ్డు కూడళ్లలో సంకేతాలను ఏర్పాటు చేయాలన్నారు. చీఫ్ సెక్రెటరీ కే.రామకృష్ణ రావు మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కింది స్థాయి నుండి రాజధాని వరకు విస్తృత అవగాహన ద్వారానే మరణాల రేటు తగ్గించవచ్చని సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఓవర్ లోడ్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఇటీవల ప్రమాదాలకు ప్రమాద కారణం ఓవర్ లోడ్ వల్లే అని సూచించారు. ప్రజల ఆస్తి ప్రాణ నష్టాలను కాపాడే బాధ్యత మన అందరి పై ఉందని జిల్లా కలెక్టర్ లు రోడ్ సేఫ్టీ కమిటీ లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రవాణా శాఖ ఏర్పాటు చేసే కార్యాచరణలో పాల్గొనాలని అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ విక్టర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.